మేము దాచుకున్న డబ్బు కోసం ఉద్యమాలు చేయాలా?: బొప్పరాజు
ABN , Publish Date - Dec 22 , 2023 | 02:32 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో దాచుకున్న డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేయాలా? అని ఏపీ జేఏసీ
7న మునిసిపల్ కార్మికుల సమస్యలపై సభ
విశాఖపట్నం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో దాచుకున్న డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేయాలా? అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు గతంలో 92 రోజులపాటు ఉద్యమాలు చేస్తే గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాల కోసం రూ.6,500 కోట్లు విడుదల చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలతోపాటు అత్యవసరానికి ఉపయోగపడుతుందనే జీతం నుంచి ప్రతినెలా కొంత సొమ్ము దాచుకొంటున్నామని, దానినీ తిరిగి వాడుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా మునిసిపల్ ఎంప్లాయి్సకి సర్వీస్ రూల్స్ను తయారుచేయలేదని విమర్శించారు. పదోన్నతుల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. మునిసిపల్ ఎంప్లాయిస్ సమస్యలపై ఏపీ మునిసిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఎంఈఎ్సఏ) ఆధ్వర్యంలో వచ్చే నెల ఏడో తేదీన విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. మహాసభకు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జెమ్స్ గౌరవ అధ్యక్షుడు వీవీ వామనరావు, ఉపాధ్యక్షుడు రవి, వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసింగ్ తదితరులు పాల్గొన్నారు.