అధికార మదంతోనే అంగన్వాడీలకు బెదిరింపులు
ABN , Publish Date - Dec 14 , 2023 | 03:04 AM
అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోగా, నిరసనలు చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తానని బెదిరించడం జగన్రెడ్డి అధికారమదానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
జగన్రెడ్డి పాలనకు మెమో ఇచ్చే రోజు దగ్గర్లోనే: అచ్చెన్నాయుడు
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోగా, నిరసనలు చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తానని బెదిరించడం జగన్రెడ్డి అధికారమదానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘ఒక్క చాన్స్ ఇస్తే, తెలంగాణ కంటే ఎక్కువ జీతాలిస్తానని బీరాలు పలికిన జగన్రెడ్డి .. అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఆ హామీ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ప్రశ్నిస్తే మెమోలు ఇచ్చి బెదరిస్తారా?’ అని నిలదీశారు. జగన్రెడ్డి పాలనకు అంగన్వాడీలు మెమో ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అంగన్వాడీ సిబ్బందిని జగన్రెడ్డి ప్రభుత్వం కట్టుబానిసల్లా చూస్తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను గాలికి వదిలేయడంతో 40లక్షలపైగా పసిపిల్లల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.