Chandrababu : కొత్త ప్రాజెక్టులు తర్వాత.. ఉన్నవాటి ఊసేదీ?
ABN , First Publish Date - 2023-08-02T03:13:24+05:30 IST
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తే... సైకో సీఎం జగన్ కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి సీమద్రోహిగా మిగిలాడని విపక్షనేత చంద్రబాబు అన్నారు.
రాయలసీమ పథకాలకు నాలుగేళ్లలో 2 వేల కోట్లేనా?
ఐదేళ్లలో 12,400 కోట్లిచ్చాం
బూతులు తిట్టడం కాదు.. అడిగిన దానికి బదులివ్వు
సీమకు చేసిన ద్రోహానికి
ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తావా?
సీఎం జగన్కు చంద్రబాబు సవాల్
‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’కి శ్రీకారం
ముచ్చుమర్రి, బానకచర్ల సందర్శన
పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నందికొట్కూరులో భారీ రోడ్షో
టీడీపీ గెలిచాక ప్రతి ఎకరాకు నీరందిస్తాం
యువతకు 20 లక్షల ఉద్యోగాలు: బాబు
నంద్యాల, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తే... సైకో సీఎం జగన్ కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి సీమద్రోహిగా మిగిలాడని విపక్షనేత చంద్రబాబు అన్నారు. ‘బూతులు తిట్టడం కాదు.. అడిగిన దానికి సమాధానం చెప్పాలి. లేదంటే రాయలసీమ కు చేసిన ద్రోహానికి సీమ నేలకు ముక్కు రాసి.. పదవి కి రాజీనామా చేస్తావా జగన్’ అని సవాల్ విసిరారు. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ ప్రారంభదినాన మంగళవారం చంద్రబాబు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించారు. ము చ్చుమర్రి ఎత్తిపోతల, బానకచర్ల హెడ్రెగ్యులేటర్ను సందర్శించారు. నందికొట్కూరు పటేల్ సర్కిల్లో జరిగి న రోడ్షోలో ప్రసంగించారు. యుద్ధభేరిలో భాగంగా నంద్యాల జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వరకు పది రోజుల్లో 2,500 కిలోమీటర్లు యాత్ర చేస్తున్నానన్నారు. సీమలో సాగు, తాగునీటి సమస్య లేకుం డా పరిష్కరించే కల్పతరువులాంటి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని తన హయాంలోనే పూర్తి చేసి జాతి కి అంకితం చేశానని గుర్తుచేశారు. ‘పక్కనే కృష్ణానది, శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నా రాయలసీమ రాళ్ల సీమగా ఉం డేది. అలాంటి సీమలో నీళ్లు పారించేందుకు 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ఎస్సార్బీసీ, ఆ తర్వాత తెలుగుగంగ ప్రాజెక్టును తీసుకొచ్చారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల రూపకల్పనకు ఆలోచన చేసింది కూడా ఆయనే. రాయలసీమకు నీళ్లు వచ్చింది టీడీపీ హయాంలో కాదా’ అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఈ సీఎం ఒక్క డీఎస్సీ అయినా ఇచ్చాడా.. అని యువతను అడిగారు.
సముద్రంలోకి వేల టీఎంసీలు..
69 నదుల నుంచి వెయ్యి టీఎంసీలు, గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోంది. వాటిని రాయలసీమకు తీసుకొస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందించవచ్చు. అందుకే మా హయాంలో రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్ రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి సీమకు రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అసమర్థ పాలనకు నిదర్శనం. గురురాఘవేంద్ర, సిద్దాపురం, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణానికి మా ప్రభుత్వం అనుమతులిస్తే ఆ ప్రతిపాదనలను జగన్ పక్కన పెట్టాడు. వెలుగోడు, బానకచర్ల అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. అభివృద్ధిని పక్కన పెట్టి పరదాల చాటున తిరగడం సిగ్గుచేటు. తప్పుచేసినవాళ్లే దొంగచాటుగా వెళ్తారు. జగన్కు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. టీడీపీలో ‘డీ’ ఉంది. డీ అంటే డెవల్పమెంట్. వైసీపీలో ‘సీ’ ఉంది. సీ అంటే కరప్షన్. ఈ సైకో సీఎం ప్రతి నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేసి, వారికి గంజాయి ఇచ్చి రోడ్లపైకి వదులుతున్నాడు. మేం అధికారంలోకి వస్తే మహానాడులో ప్రవేశపెట్టిన సూపర్సిక్స్ పథకాలతో సంక్షేమాన్ని అందిస్తాం. నా వయసు గురించి జగన్ అవాకులు, చవాకులు పేలుతున్నాడు. రోజుకు 18 గంటల చొప్పున ప్రజల కోసం నేను పనిచేశా. జగన్ అలా ఒక్క రోజు కూడా చేయలేడు. చేతకాదు కూడా.
అన్ని నియోజకవర్గాల్లో సాగునీటి పోరు
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పడకేసిన సాగునీటి ప్రాజెక్టులపై తమ అధినేత చంద్రబాబు చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనకు మద్దతుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగునీటి అంశాలపై పోరాటం చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఈ ప్రభుత్వం వచ్చాక పాత ప్రాజెక్టులకు సంబంధించి కూడా కనీస నిర్వహణ కొరవడిందని ఆ పార్టీ భావిస్తోంది. కాలువల్లో కనీసం తూటికాడ కూడా తీయకపోవడం.. పూడికతీత పనులు చేపట్టకపోవడం.. చెరువులు, చిన్న నీటి వనరులకు సంబంధించిన చిన్న చిన్న పనులు కూడా చేపట్టకపోవ డం.. వంటి సమస్యలు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయని అంచనా వేసింది. వీటిని గుర్తించి ఈ దిశగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని ఇన్చార్జులు, నేతలను ఆదేశించింది.
69 నదుల అనుసంధానంతో...
రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి వంటి 69 నదులు ఉన్నాయని, వీటిని అనుసంధానం చేస్తే సీమ కరువు దూరం అవడమే కాకుండా.. రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుంద ని చంద్రబాబు తెలిపారు. జగన్ ప్రభుత్వం సీమ ప్రాజెక్టులపై శీతకన్ను వేసిందని, తాము అనుమతి తీసుకొచ్చిన ప్రాజెక్టులను కూడా పక్కన పెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రాజెక్టులపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ‘తెలుగుగంగపై ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.504 కోట్లు ఖర్చు చేసింది. జగన్ రూ.383 కోట్లే ఖర్చు చేశారు. హంద్రీ-నీవా ఫేజ్-1, ఫేజ్-2 సంబంధించి మేం 4,182 కోట్లు ఖర్చు చేశాం. జగన్ సర్కారు రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామని చేయలేదు. మడకశిర బ్రాంచ్ కెనాల్కు టీడీపీ రూ.806 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ రూపాయి కూడా కేటాయించలేదు. కర్నూలు పశ్చి మ ప్రాంతాన్ని కరువు నుంచి కాపాడేందుకు వేదవతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.1,942 కోట్ల తో టెండర్లు పిలిస్తే.. చేసిన పనులకు జగన్ పైసా ఇవ్వలేదు. మా ఐదేళ్ల హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,293 కోట్లు ఖర్చు చేశాం. జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రూ.22,165 కోట్లే వ్యయం చేసింది’ అని ఆక్షేపించారు.
నేడు పులివెందులలో బాబు రోడ్షో
ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు మంగళవారం రాత్రి కడప జిల్లా జమ్మలమడుగులో బస చేశారు. బుధవారం ఉదయం 11.30కు కొండాపురం మండలంలోని గండికోట సీబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ను పరిశీలిస్తారు. సాయంత్రం 3 గంటలకు పులివెందుల చేరుకుంటారు. ఇక్కడ రోడ్షో నిర్వహిస్తారు.