ఆదిరెడ్డి కుటుంబం న్యాయపోరు
ABN , First Publish Date - 2023-05-02T03:12:29+05:30 IST
ఏ తప్పు చేయకపోయినా, తమ చిట్స్ వ్యాపారంపై ఒక్క ఫిర్యాదు కూడా లేకపోయినా, వర్తించని సెక్షన్లతో ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అరెస్ట్ చేసి జైలుకు పంపడంపై న్యాయపోరాటానికి అదిరెడ్డి కుటుంబం సిద్ధమవుతోంది. బెయిల్ కోసం సోమవా రం హైకోర్టును ఆశ్రయించారు
హైకోర్టులో బెయిల్ పిటిషన్
వర్తించని సెక్షన్లతో వేధింపులా?
ఆగ్రహించిన టీడీపీ నాయకులు
తండ్రీ కొడుకులకు జైల్లో పరామర్శ
రాజమహేంద్రవరం, మే 1(ఆంధ్రజ్యోతి): ఏ తప్పు చేయకపోయినా, తమ చిట్స్ వ్యాపారంపై ఒక్క ఫిర్యాదు కూడా లేకపోయినా, వర్తించని సెక్షన్లతో ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అరెస్ట్ చేసి జైలుకు పంపడంపై న్యాయపోరాటానికి అదిరెడ్డి కుటుంబం సిద్ధమవుతోంది. బెయిల్ కోసం సోమవా రం హైకోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది పోసా ని వేంకటేశ్వర్లు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశా రు. ఈ విషయాన్ని వాసు బావ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సోదరుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ రామ్మోహన్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తదితరులు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అప్పారావు, వాసు ఏ తప్పూ చేయలేదన్నారు. ఆదిరెడ్డి అప్పారావు ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. కాగా, ఆదివారం ఉదయం 4.45 గంటలకు ఈ నేతలిద్దరినీ సీఐడీ ఆఫీసుకు తీసుకుని వెళ్లి రాత్రి 11 గంటల వరకూ అక్కడే కూర్చోపెట్టారు. 11.45 నిమిషాలకు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గంధం సునీత ముందు హాజరుపరచగా, ఈనెల 12వ తేదీ వరకూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఆదిరెడ్డి కుటుంబం సుమారు 30 ఏళ్ల నుంచి చిట్ఫండ్ వ్యాపా రం చేస్తోంది. ఇంతవరకూ ఒక ఫిర్యాదు కూడా లేదని ఆ కుటుంబం చెబుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఎమ్మెల్యే భవానీతో ఓటు వేయించాలని వైసీపీ అధిష్ఠానం ఒత్తిడి తెచ్చింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే భవానిని తీసుకుని వెళ్లి ఓటింగ్లో పాల్గొనేలా చేశారు. దీంతో వైసీపీ ఆదిరెడ్డి కుటుంబాన్ని వేధించాలని చూస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వర్తించని సెక్షన్లు
ఏ ఫిర్యాదు కూడా లేకుండా, గతంలో అధికారులు ఆమోద ముద్ర వేసిన రికార్డులను తిరగదోడి పెట్టిన సెక్షన్లు ఏమీ వర్తించవని సీనియర్ న్యాయవాది, ఏపీసీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మైనేని రామసత్యసాయి స్పష్టం చేశారు. న్యాయవాదుల కథనం ప్రకారం.. ఆదిరెడ్డి కుటుంబంపై 1999 ఏపీపీడీఎ్ఫఈ(ఏపీ చిట్స్ డిపాజిటర్ల చట్టం) సెక్షన్ 5 కింద కేసు పెట్టారు. డిపాజిటర్లు డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వకపోతే ఈ సెక్షన్ వర్తిస్తుంది. కానీ ఒక ఫిర్యాదుదారు కూడా లేరు. ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ సొమ్ములు కాజేసి చెల్లించకపోతే పెట్టే 409 సెక్షన్ మోపారు. కానీ ఇక్కడ నిందితులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. డిపాజిటర్లను మో సం చేసినట్టు ఫిర్యాదు అందితే సెక్షన్ 420 ప్రయోగిస్తారు. కానీ, ఫిర్యాదే లేదు. తప్పుడు రికార్డులు సృష్టించి, రిజిస్ర్టార్ ఆఫ్ చిట్స్ను మోసగిస్తే సెక్షన్ 477(ఎ) కింద విచారణ జరుపుతారు. కానీ 2020-21లో వీరు సమర్పించిన రికార్డులను అధికారులు క్రాస్ చేసి ఆమోదం తెలిపారు. కంపెనీ డైరెక్టర్లు కుట్ర చేసి డిపాజిట్దారులను మోసగించే ప్రయత్నం చేస్తే సెక్షన్ 120(బి) ప్రయోగిస్తారు. దీనిపై కూడా ఫిర్యాదు లేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు నిలవదని చెబుతున్నారు.