ఆదాలకు దక్కని ఆదరణ..!

ABN , First Publish Date - 2023-02-06T21:54:58+05:30 IST

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) పార్టీని వీడినంత మాత్రాన నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం (Nellore Rural Constituency)లో వైసీపీకి వచ్చిన నష్టం...

ఆదాలకు దక్కని ఆదరణ..!

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) వైసీపీని వీడినా నష్టమేమీ లేదు.. రూరల్‌కు ఎలాంటి ఇబ్బందులుండవ్.. ఇంచార్జ్‌, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని అక్కున చేర్చుకుని తామేంటో నిరూపించాలి.. ఇదీ నియోజకవర్గ కార్యకర్తలు అనుకున్న మాట. అయితే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ఇంచార్జ్‌‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదాల నియోజకవర్గానికి రావడంతో భారీ ర్యాలీ నిర్వహించింది వైసీపీ శ్రేణులు. అయితే ర్యాలీకి జన స్పందన తక్కువగా కనిపించడంతో వైసీపీ శ్రేణులను, అభిమానులను నిరుత్సాహపరిచింది. ఊరేగింపు వాహనంలో వైసీపీ నాయకుల సంఖ్య బలంగా కనిపించింది.. కానీ ర్యాలీకి ముందు వెనుక మాత్రం చాలా పలుచగా కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తిరుగుబాటు నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు.

పూర్వం నుంచి రూరల్‌ నియోజకవర్గంతో ఆదాలకు పరిచయాలు ఉండటం, ఆయన్ను ఇన్‌చార్జి చేస్తే వైసీపీ క్యాడర్‌ అలాగే నిలబడుతుందని, శ్రీధర్‌రెడ్డి వెంట వెళ్లే వైసీపీ నాయకులనూ కట్టడి చేయవచ్చని పార్టీ పెద్దలు భావించారు. చివరకు ఆదాలను ఒప్పించి ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టారు. ఈ బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా సోమవారం సాయంత్రం ఆదాల నెల్లూరుకు వచ్చారు. ఆయన్ను ఘనంగా స్వాగతించడం ద్వారా రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్టీ మారినా వచ్చిన నష్టం ఏమీ లేదని రుజువు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నగరం అంతా ప్రత్యేకించి రూరల్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆదాలకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

కోటంరెడ్డి లేకపోతేనేం.. మేమంతా ఉన్నాం

‘కోటంరెడ్డి లేకపోతేనేం.. మేమంతా ఉన్నాం’ అనే ధైర్యాన్ని రూరల్‌ వైసీపీ క్యాడర్‌లో నింపడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులందరూ ర్యాలీకి హాజరయ్యారు. మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి (Minister Kakani Govarthan Reddy), రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి విక్రమ్‌రెడ్డితోపాటు సీనియర్‌ నాయకులు ఆదాలకు స్వాగతం పలికి ఆయనతోపాటు వాహనంలో ర్యాలీగా ముందుకు సాగారు. ఇంతచేసినా ప్రజల్లో మాత్రం స్పందన తక్కువగానే కనిపించింది. అయ్యప్పగుడి సెంటర్‌ నుంచి ఆదాల నివాసం వరకు ర్యాలీ సాగింది. ప్రతి సెంటరు వద్ద ఆ డివిజన్‌ పరిధిలోని కార్పొరేటర్లు లేదా ముఖ్య నాయకులు ఒక గజమాలతో ఆదాలకు స్వాగతం పలికారు కానీ ర్యాలీలో ఆదాలతో కలిసి నడవలేదు. భారీ ప్లెక్సీలను చూసి ఆదాల ర్యాలీ అదిరిపోతుంది అనుకున్న వైసీపీ శ్రేణులు, అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. జిల్లావ్యాప్తంగా ఉన్న నాయకులు తరలివచ్చినా, ర్యాలీ నడిచిన దారికి అటు వైపు సిటీ నియోజకవర్గం విస్తరించి ఉన్నా, జన హాజరు తక్కువగా కనిపించడం రాజకీయ వర్గాలు, సామాన్య ప్రజల్లో చర్చనీయాంశమైంది. కనీసం సిటీ నియోజకవర్గం నుంచి ఒకరిద్దరు కార్పొరేటర్లు మినహా ఎవరూ కూడా రాకపోవడం గమనార్హం. రూరల్‌ నియోజకవర్గంలో ఆదాలకు బలం లేదనే విషయాన్ని పరోక్షంగా అధిష్ఠానం దృష్టికి తీసుకురావడం కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలా నీరుగార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదాలకు ఆదరణ కరువైందనే చర్చ జిల్లాలో నడుస్తోంది.

Updated Date - 2023-02-06T22:05:34+05:30 IST