మున్సిపల్ కార్యాలయంలోనే టీడీపీ కౌన్సిలర్పై వైసీపీ కౌన్సిలర్ దాడి
ABN , Publish Date - Dec 31 , 2023 | 03:56 AM
పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ రెచ్చిపోయారు.
పార్వతీపురంలో ఘటన
పార్వతీపురం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ రెచ్చిపోయారు. టీడీపీ కౌన్సెలర్పై దాడికి తెగబడ్డారు. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో శనివారం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు పట్టణాభివృద్ధిపై ప్రశ్నించారు. తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై నిలదీశారు. దీంతో అధికార పక్ష కౌన్సెలర్లు టీడీపీ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశ మందిరం నుంచి టీడీపీ కౌన్సిలర్లు బయటకు వచ్చేశారు. ఇంతలో 25వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఎన్.సుధీర్ ‘నేను సారా వ్యాపారం చేస్తున్నానంటూ ప్రచారం చేస్తావా’? అని అనుచరులతో కలిసి 8వ వార్డు టీడీపీ కౌన్సెలర్ నారాయణరావుపై ఇష్టారాజ్యంగా దాడి చేశారు. అధికార, ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు అడ్డుకోవడంతో, పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అనుచరునిగా పేరొందిన సుధీర్ టీడీపీ కౌన్సెలర్పై దాడి చేయడం రాజకీయ దుమారం రేపింది. కాగా.. ఇరు వర్గాలూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సుధీర్ తనపై దాడి చేశారని నారాయణరావు ఫిర్యాదు చేశారు. అయితే తనపై నారాయణ రావు దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దుషించారంటూ సుధీర్ ఫిర్యాదు చేయడం కొసమెరుపు.