కోస్తాకు తుఫాన్ గండం
ABN , First Publish Date - 2023-11-29T04:30:17+05:30 IST
కోస్తాకు తుఫాన్ గండం పొంచి ఉంది. డిసెంబరు 4 నుంచి 6 వరకు దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా వరకూ అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
![కోస్తాకు తుఫాన్ గండం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
‘మిచౌంగ్’గా నామకరణం
డిసెంబరు 5న కావలి, కాకినాడ, శ్రీకాకుళంలలో ఏదో ఒకచోట వద్ద తీరం దాటుతుందని అంచనా
4, 5, 6 తేదీల్లో కోస్తాకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కోస్తాకు తుఫాన్ గండం పొంచి ఉంది. డిసెంబరు 4 నుంచి 6 వరకు దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా వరకూ అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమంగా పయనించి మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది డిసెంబరు ఒకటో తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా మారనుంది. అక్కడ నుంచి ఉత్తర వాయవ్యంగా పయనించి మూడో తేదీ నాటికి తుఫాన్గా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని మరింత బలపడి పెను తీవ్రతుఫాన్గా మారుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తుఫాన్కు మయన్మార్ సూచించిన ‘మిచౌంగ్’ అని పేరు పెట్టారు ఈ క్రమంలో డిసెంబరు ఐదో తేదీ సాయంత్రం చెన్నైకు ఉత్తరాన కావలి సమీపంలో అతి తీవ్ర తుఫాన్గా తీరం దాటుతుందని అమెరికన్ నేవీకి చెందిన ఒక మోడల్ వెల్లడిస్తోంది. అయితే, వచ్చే నెల 3న నైరుతి బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్గా మారి తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించి ఐదో తేదీ సాయంత్రం కాకినాడకు దగ్గరలో తీరం దాటుతుందని ఐరోపా మోడల్ తెలియజేస్తోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్గా మారుతుందని పేర్కొంది. మరో మోడల్ ప్రకారం డిసెంబరు 5 లేదా 6వ తేదీల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా, ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు ఉత్తర భాగాన తీరం దాటుతుందని ఒక సంస్థ అంచనా వేసింది. 5న కోస్తాలో భారీ నుంచి అతి భారీవర్షాలు, 6న ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 7న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కోస్తా రైతులను అప్రమత్తం చేసింది. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో పొలాల్లో పంట సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని, కుప్పలను పటిష్టం చేసుకోవాలని సూచించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశముందని, వరి కుప్పలపై బరువులు పెట్టాలని వాతావరణ నిపుణులు సూచించారు.