సౌర విద్యుత్ పాతికేళ్లు యూనిట్ రూ.2.49కే
ABN , First Publish Date - 2023-11-29T04:12:06+05:30 IST
రాష్ట్రంలో రైతులకు పగటి పూట తొమ్మిది గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా 25 ఏళ్లపాటు యూ నిట్ రూ.2.49కు 17,000 విలియన్ యూనిట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం జగన్ చెప్పారు.
రైతుకు 9 గంటలిచ్చేందుకే ఒప్పందం: సీఎం
పలు ప్లాంట్లు, సబ్స్టేషన్లకు శంకుస్థాపన
అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు పగటి పూట తొమ్మిది గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా 25 ఏళ్లపాటు యూ నిట్ రూ.2.49కు 17,000 విలియన్ యూనిట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం జగన్ చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి 3,000 మెగావాట్లు, 2025 సెప్టెంబరు నాటికి మరో 3,000 మెగావాట్లు, 2026 నాటికి మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నా రు. మంగళవారమిక్కడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రూ.6,600 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ సబ్స్టేషన్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణానికి ఆయ న వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పునాదిరాయి వేసినవాటిలో కడపలో 750 మెగావాట్ల సామర్థ్యంతో, అనంతపురంలో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాజెక్టులు, 16 సబ్స్టేషన్లు ఉన్నాయి. అదేవిధంగా 12 సబ్స్టేషన్లను కూడా ప్రారంభించారు. హెచ్పీసీఎల్తో రూ.10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులపై ఇంధన శాఖ ఆయన సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.