వైభవంగా యాదాద్రి లక్ష్మీనరసింహుడి పరిణయ వేడుక
ABN , First Publish Date - 2022-03-12T02:18:41+05:30 IST
సర్వలోక రక్షకుడు.. జగత్కల్యాణ కారకుడు.. ఇలవైకుంఠంగా భక్తజనావళి పూజలు అందుకుంటున్న యాదాద్రి దివ్యక్షేత్రంలో
యాదాద్రి: సర్వలోక రక్షకుడు.. జగత్కల్యాణ కారకుడు.. ఇలవైకుంఠంగా భక్తజనావళి పూజలు అందుకుంటున్న యాదాద్రి దివ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహుల తిరుకల్యాణం శుక్రవారం కమనీయంగా సాగింది. భక్తపరాయణుడు, అవతార పురుషుడు, నారసింహుడితో సిరి సంపదలకు నెలవైన సముద్రుడి తనయ లక్ష్మీదేవితో విశ్వకల్యాణం కాంక్షిస్తూ... పాంచరాత్రగమ శాస్త్రపద్ధతిలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లోకకల్యాణం కోసం నిర్వహించిన దేవదేవుడి తిరుకల్యాణ వేడుకలకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్ల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు హాజరై ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారికి బ్రహ్మోత్సవ తిరుకల్యాణోత్సవంలో టీటీడీ తరఫున చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య వైవీ స్వర్ణలతారెడ్డి సంప్రదాయరీతిలో పట్టువస్త్రాలను సమర్పించారు. ప్రధానాలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆగమ నియమానుసారం ఆస్థానపరంగా సంప్రదాయరీతిలో కొండపై బాలాలయంలో తిరుకల్యాణం నిర్వహించారు.