యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
ABN , First Publish Date - 2022-03-05T06:53:33+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం
యాదాద్రి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. లోకకల్యాణం, విశ్వశాంతి కోసం ప్రతిఏటా నిర్వహించే దేవదేవుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. స్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగేలా సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడికి తొలిపూజలు చేశారు. స్వయంభు లక్ష్మీనృసింహుడు కొలువైన ప్రధాన గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారికి కంకణధారణ నిర్వహించారు. ఈ మహోత్సవ వైదిక పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్ధిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు, అర్చక బృందం పారాయణిక పరివారంతో ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకల్యాణ మహోత్సవానికి భూదాన్పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం నేసిన రెండు పట్టు చీరలు, పట్టు పంచె, ముత్యాల తలంబ్రాలను మునిసిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి బాలాలయ కల్యాణ మండపంలో ఈవో గీతకు అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, చతుర్వేద మంత్ర పారాయణ పఠనాలు, సాయంత్రం భేరీ పూజ, దేవతాహ్వానం, హవన పూజలు నిర్వహిస్తారు.
ఆన్లైన్ టికెటింగ్ ట్రయల్ రన్
యాదాద్రి నృసింహుడి దర్శనానికి ఆన్లైన్ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈసీఐఎల్ సాంకేతిక బృందం టికెట్ల జారీపై స్థానిక యూనియన్ బ్యాంక్ సిబ్బందికి అవగాహన కల్పించింది. తొలి రోజున 200 మంది ప్రత్యేక దర్శన టికెట్లు జారీ చేశారు. అలాగే సంప్రదాయ దుస్తులతోనే నృసింహుడిని దర్శించుకోవాలని సూచించారు. పురుషులు కుర్తా, దోతీ, పైజా మా, మహిళలు చీర, చుడీదార్లతో రావాలని పేర్కొన్నారు.