చావనైనా చస్తాం.. పోడు భూములు వదలం

ABN , First Publish Date - 2022-07-07T09:31:00+05:30 IST

పోడు భూములనే నమ్ముకొని జీవిస్తున్నాం.. చావుకైనా వెనుకాడం.. సాగులో ఉన్న భూములను మాత్రం వదలం..

చావనైనా చస్తాం.. పోడు భూములు వదలం

  • ఫారెస్టు అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్న గిరిజన రైతులు
  • అధికారుల ససేమిరా.. వాగ్వాదానికి దిగిన రైతులు
  • పురుగుల మందు తాగిన గిరిజన మహిళా రైతు


కొల్లాపూర్‌, మంచిర్యాల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పోడు భూములనే నమ్ముకొని జీవిస్తున్నాం.. చావుకైనా వెనుకాడం.. సాగులో ఉన్న భూములను మాత్రం వదలం.. విత్తనాలు వేయడాన్ని అడ్డుకోవద్దంటూ గిరిజన మహిళా రైతులు అటవీ అధికారుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడిన సంఘటన బుధవారం నాగర్‌కర్నూల్‌లో చోటు చేసుకుంది. జిల్లాలోని కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండం సమీపంలో మేదర్‌బండ దగ్గర పోడు భూముల్లో విత్తనాలు వేస్తున్న గిరిజన రైతులను ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ సత్యం, బీట్‌ అధికారి మహేష్‌ అడ్డుకున్నారు. తాము 30 ఏళ్ల నుంచి ఇవే పోడు భూములను సాగు చేస్తున్నామన్నామని, తమను అడ్డుకోవద్దని గిరిజన మహిళా రైతులు ఫారెస్టు అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. అధికారులు ససేమిరా అనడంతో అధికారుల, గిరిజన రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. తమపై వేధింపులు ఆపాలంటూ గిరిజన మహిళ దేవి ఫారెస్టు అధికారుల ముందే పురుగుల మందు తాగి పొలంలోనే పడిపోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆమెను కొల్లాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-07-07T09:31:00+05:30 IST