‘వందే భారత్‌’ వచ్చేస్తోంది!

ABN , First Publish Date - 2022-12-12T04:03:32+05:30 IST

హైస్పీడ్‌ రైలుగా పేరొందిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రానుంది.

‘వందే భారత్‌’   వచ్చేస్తోంది!

సికింద్రాబాద్‌-విజయవాడ మార్గంలో

జనవరి మొదటి వారంలో పట్టాలెక్కనున్న రైలు?

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): హైస్పీడ్‌ రైలుగా పేరొందిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రానుంది. తొలుత ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌-విజయవాడ మార్గంలో నడపాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ట్రాక్‌ సామర్థ్యం, సిగ్నలింగ్‌ సర్వేను పూర్తి చేశారు. ఈ మార్గంలో విజయవంతమైతే మరో రైలును సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడపాలని భావిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ప్రస్తుతం ట్రాక్‌ గరిష్ఠ వేగం 110 కిలోమీటర్లు మాత్రమే ఉంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దీంతో ట్రాక్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మూలమలుపుల వద్ద 110 కిలోమీటర్లు, వంతెనల వద్ద 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైలును నడిపించాలని భావిస్తున్నామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ ఖరారైతే ఈ నెల చివరి వారంలో, లేకుంటే కొత్త సంవత్సరంలో తొలి వారంలోనే వందే భారత్‌ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.

Updated Date - 2022-12-12T04:03:33+05:30 IST