‘ఉపాధి హామీ’పై నీలినీడలు!

ABN , First Publish Date - 2022-03-02T08:37:09+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై...

‘ఉపాధి హామీ’పై నీలినీడలు!

అంబుడ్స్‌ పర్సన్లను నియమించని రాష్ట్రాలకు నిధులు ఇవ్వబోమన్న కేంద్రం

నియామకం జరపని రాష్ట్రాల్లో తెలంగాణ


హైదరాబాద్‌, మార్చి1 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై తెలంగాణలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంబుడ్స్‌ పర్సన్లను నియమించకపోవడం, ఈ నియామకాలు జరపని రాష్ట్రాలకు ఉపాధి హామీ నిధులు ఇవ్వరాదని కేంద్రం నిర్ణయించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం పారదర్శకంగా అమలయ్యేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అంబుడ్స్‌ పర్సన్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ఉపాధి పనులపై కూలీల నుంచి, ఇతర పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారం, పథకం అమలులో అక్రమాలు చోటుచేసుకోకుండా చూడటం, అక్రమాలు జరిగితే.. విచారణ జరిపి తగిన పరిష్కారాలను చూపడం వంటి బాధ్యతలను అంబుడ్స్‌ పర్సన్లు నిర్వర్తిస్తుంటారు. జిల్లాకు ఒకరి చొప్పున వీరిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. దీని ప్రకారం తెలంగాణలో హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో అంబుడ్స్‌ పర్సన్లను నియమించాల్సి ఉండగా..  రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిని కూడా నియమించలేదు. దీంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితే ఉంది. కేంద్రం తరచూ ఈ విషయాన్ని రాష్ట్రాల దృష్టికి తీసుకొస్తున్నా స్పందించడంలేదు. దీంతో అలాంటి రాష్ట్రాలకు ఉపాధి హామీ నిధులు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ పథకం అమలయ్యే రాష్ట్రాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కనీసం 80 శాతం జిల్లాల్లో అంబుడ్స్‌ పర్సన్లను నియమించాలని, లేదంటే నిధులివ్వబోమని ప్రకటించింది. ఆ రాష్ట్రాల జాబితాలో రాష్ట్రాల్లో గుజరాత్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, గోవాతోపాటు తెలంగాణ కూడా ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.

సాఫ్ట్‌వేర్‌పై అవగాహన లేమి..  

ఉపాధి హామీ పనులను 2005 చట్టం ప్రకారం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. కానీ, దీని నిర్వహణపై పూర్తి అవగాహన  లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల కారణంగా సంబంధిత అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సకాలంలో డబ్బులు అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. అంబుడ్స్‌ పర్సన్ల నియామకాలతో ఈ సమస్యలు తీరే అవకాశం ఉన్నందున.. పథకం అమలులో అవినీతి, అవకతవకలను అరికట్టేందుకు వారి నియామకం చేపట్టాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని దళిత బహుజన ఫ్రంట్‌ ప్రతినిధి శంకర్‌ కోరారు.

Updated Date - 2022-03-02T08:37:09+05:30 IST