అందమైన ఫ్యామిలీ.. అంతం!
ABN , First Publish Date - 2022-01-21T08:43:38+05:30 IST
ts news
భార్య, కూతురికి విషమిచ్చి చంపిన టెకీ.. అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్య
పటాన్చెరు, జనవరి 20: ఆయనో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు రూ.2 లక్షల జీతం! ఆమె కార్పొరేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలు. ఇద్దరూ దంపతులు. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముద్దులొలికే ఏడేళ్ల కూతురు ఉంది! ఈ కుటుంబం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బీరంగూడా వందననపురి కాలనీలోని సొంతింట్లో నివాసం ఉంటోంది! రెండ్రోజులుగా ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకురాలేదు. అనుమానంతో వెళ్లి చూస్తే.. ముందు గదిలో భార్య, కూతరు నోట్లోంచి నురగలు, నెత్తురు కక్కుతూ విగత జీవులుగా కనిపించారు! బెడ్రూంలో భర్త ఉరేసుకున్న స్థితిలో కనిపించాడు. మృతులను శ్రీకాంత్ గౌడ్ (42), ఆయన భార్య అనామిక (40), కూతురు స్నిగ్ధ (7)గా గుర్తించారు. భార్య, కూతురుకు విషమిచ్చి చంపి.. అనంతరం శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఉన్నతోద్యోగం, జీవన విధానం ఆధారంగానైతే ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులు కారణం కాకపోవచ్చునని బలంగా నమ్ముతున్నారు. మరి.. ఎందుకు ఆయన ఇంతటి దారుణానికి ఒడిగట్లు? అనేది సస్పెన్స్గా మారింది! శ్రీకాంత్, టీఎసీఎ్సలో పనిచేస్తున్నారు. స్వస్థలం మేడ్చల్ జిల్లా షామీర్పేట. అనామికది ఓల్డ్ అల్వాల్. ఇద్దరిదీ కులాంతర వివాహం. వందనపురి కాలనీలో ఈ దంపతులు ఓ ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటున్నారు. ఓ కార్పొరేట్ పాఠశాలలో అనామిక పనిచేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం బుధవారం ఉదయం తర్వాత ఎవ్వరూ బయట కనిపించలేదు. ఇరుగు పొరుగు వారికి అనుమానం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు, దేవుడి పటాల తీరును పరిశీలిస్తే తీవ్ర మానసిక సమస్యలతోనే శ్రీకాంత్ ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనామిక, స్నిగ్ధ, శ్రీకాంత్ నుదుర్లకునెత్తుటి బొట్లు ఉన్నాయి. దేవుడి పటాల వద్ద పూజలు చేసిన అనవాళ్లు కనిపించాయి. ఆ పటాలు బోర్లిచి ఉన్నాయి. భార్య, బిడ్డకు తినే ఆహారంలో విషం కలిపి వారు మృతిచెందారని నిర్ధారించుకున్నాక.. దేవుడి పటాలకు పూజలు చేసి, మృతదేహాలకు నెత్తుటి తిలకం దిద్ది శ్రీకాంత్ ఉరేసుకున్నట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.