ఫొటో షూట్ పేరుతో అమ్మాయిలకు వల
ABN , First Publish Date - 2022-09-23T08:18:09+05:30 IST
ఫొటో షూట్ పేరుతో అమ్మాయిలకు వల
మాయ మాటలు చెప్పి వ్యభిచార ఉచ్చులోకి
మధిరలో దందా.. బాలిక కిడ్నా్పతో మరోసారి వెలుగులోకి
మధిరటౌన్, సెప్టెంబరు 22: మధ్య తరగతి అమ్మాయిలే లక్ష్యం. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుంటారు. మాయ మాటలు చెప్పి వల వేస్తారు. ఆపై వ్యభిచారం చేసేలా ప్రోత్సహిస్తారు. ఖమ్మం జిల్లా మధిరలో ఓ ఫొటోగ్రాఫర్ మరికొందరు కలిసి చేస్తున్న ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పట్టణంలో బుధవారం ఓ బాలిక కిడ్నాప్ కావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ ఫొటో స్టూడియో ఉంది. అందులో పని చేస్తున్న ఏపీలోని కడప జిల్లాకు చెందిన బాలగురివి రెడ్డి గతంలో స్టేషన్ రోడ్డులో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ ఇంటి యజమాని కూతురును బుధవారం రాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. తెల్లవారే సరికి బాలిక కనపడకపోవడంతో తల్లిదండ్రులు చాలా వెతికారు. చివరకు కాలనీలోని సీసీ కెమెరాను పరిశీలించగా.. ఫొటోగ్రాఫర్ తమ ఇంటి గోడ దూకిన దృశ్యం కనిపించింది. దీంతో తమ కూతురిని బాలగురివి రెడ్డి కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మధిరతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో ఫొటో, వీడియో షూటింగ్లకు వెళ్లే ఫొటోగ్రాఫర్లు అక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్లో పనిచేసే అమ్మాయిలతో పాటు కొందరు బ్యూటీషియన్లను ట్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి బలహీనతలను అవకాశంగా తీసుకొని, అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యేలా ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. మధిరలోని స్టూడియో వారికి యానాంలో ఓ హోటల్ వారితో పరిచయం ఉండటంతో, వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రూమ్ ఏర్పాటు చేస్తారు. అనేకసార్లు అమ్మాయిలను మేకప్ కోసమని, ఈవెంట్ల పేరుతో అక్కడికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరికొందరిని షూటింగ్ల పేరుతో లద్దాక్కు.. ఓ బ్యూటీషియన్ను ఫొటోషూట్ ఉందని ఐదు రోజులు పాటు గోవాకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వీరు విజయవాడ, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్వహించే ఈవెంట్లను షూట్ చేసేందుకు వెళ్లి, అక్కడి వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయిలను, బ్యూటీషియన్లను వల వేసి ఓ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు సమాచారం. నాలుగేళ్లుగా ఈ తతంగం నడుస్తోంది. తాజాగా బాలిక కిడ్నాప్ వ్యవహారంతో వీరి ఆగడాలపై మధిరలో చర్చ జరుగుతోంది.