Sharmila: థాంక్యూ మోదీజీ!
ABN , First Publish Date - 2022-12-07T02:56:39+05:30 IST
షర్మిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రధాని దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘థాంక్యూ మోదీజీ’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
అంబేడ్కర్ను అవమానించిన కేసీఆర్
రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం అంటారా?
తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం: షర్మిల
అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా షర్మిల నివాళి
థాంక్యూ మోదీజీ.. ప్రధానే కాదు ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుని అరెస్టు చేయడం అన్యాయమంటూ చాలా మంది సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలవుతోంది. అంటే.. కొట్టి చంపేసే రాజ్యాంగం.
హైదరాబాద్/కవాడిగూడ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): షర్మిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రధాని దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘థాంక్యూ మోదీజీ’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రధాని ఒక్కరే కాదని, ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుని అరెస్టు చేయడం అన్యాయమంటూ చాలా మంది సానుభూతి, మద్దతు తెలిపారని షర్మిల అన్నారు. స్పందించకుండా బాధపడ్డవారు కూడా ఎంతో మంది ఉన్నారని, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్బండ్లో అంబేడ్కర్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని దిగ్ర్భాంతి గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను అవమానించారని షర్మిల అన్నారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చాలనడమేంటని ప్రశ్నించారు. తెలంగాణలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడంలేదని, సీఎం కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు.
కేసీఆర్ రాజ్యాంగం అంటే.. కొట్టి చంపేసే రాజ్యాంగమని, ఈ రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులు ఉండవని పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, దళితబంధును 10 శాతం మందికి కూడా ఇవ్వలేదని అన్నారు. శ్రీకాంతచారి ఆత్మబలిదానం చేసుకుని అమరుడైతే.. అగ్గిపెట్టె మరిచిపోయిన హరీశ్రావు మంత్రి అయ్యారంటూ సోషల్ మీడియాతో ట్రోల్ అవుతోందని తెలిపారు.. ‘‘మరొకరు గడ్డాలు పెంచుకొని దీక్షలు చేసినట్లు నాటకమాడారు, ఇంకొకామె అమాయకంగా బతుకమ్మ ఆడుతూనే లిక్కర్ మాఫియా నడిపింది. ఇంకొకతను ఉద్యోగాల కోసం వందల మంది నిరుద్యోగులు చనిపోతుంటే.. అనుకున్నదాని కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని, నిరుద్యోగ సమేస్య లేదంటూ నాటకాలాడుతున్నారు. మొత్తం కుటుంబానికే ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
8న పాదయాత్ర పునఃప్రారంభం..!
నర్సంపేట నియోజకవర్గంలో నిలిచిపోయిన షర్మిల పాదయాత్రను ఈ నెల 8న పునఃప్రారంభించే అవకాశాలున్నాయని వైఎస్సార్టీపీ వర్గాలు తెలిపాయి. వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్థానిక పార్టీ నేతలు వివరణ ఇచ్చారని, షరతులతో కూడిన అనుమతి లభించే అవకాశం ఉందని వెల్లడించాయి.