ఉస్మానియా భూ ఆక్రమణపై ఛార్జిషీట్ దాఖలు
ABN , First Publish Date - 2022-08-10T13:03:59+05:30 IST
ఉస్మానియా భూ ఆక్రమణపై ఛార్జిషీట్ దాఖలు
హైకోర్టుకు వివరించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన దాదాపు 3,500 చదరపు గజాల భూమి ఆక్రమణ విషయమై దర్యాప్తు పూర్తి చేసి, ఛార్జిషీట్ దాఖలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. భూఆక్రమణపై ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకున్నందున ఇక ఈ కేసుపై సంబంధింత దిగువ కోర్టు విచారణ చేపడుతుందని హైకోర్టు పేర్కొంది. ఉస్మానియా భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పి. రమణారావు అనే పరిశోధక విద్యార్థి 2020లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఓయూ అధికారులు భూఆక్రమణకు సంబంధించి అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తులసి హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ తమ పక్కనే ఉన్న ఓయూ స్థలాన్ని ఆక్రమించి, అక్రమంగా తొమ్మిది మందికి రిజిస్ర్టేషన్లు చేసినట్లు అధికారులు గతంలో హైకోర్టుకు తెలిపారు. మరోవైపు ఆ భూమి తమదేనని, తమకు అనుకూలంగా సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తులసి హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ వాదించింది. దాంతో ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని, క్రయవిక్రయాలు చేయకూడదంటూ హైకోర్టు గతంలో మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ చాడ విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా చేర్చామని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను సమర్పించారు. ఇకపై ఈ కేసు విచారణను చట్టప్రకారం సంబంధిత దిగువ కోర్టు చేపడుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ముగిస్తూ ఆదేశాలు జారీచేసింది.