ఇసుక మాఫియా ఆగడాలు సహించం
ABN , First Publish Date - 2022-01-03T16:31:04+05:30 IST
పోలీసులతో కుమ్మక్కై ప్రజల సంపదను దోచుకుంటున్న ఇసుక మాఫియా ఆగడాలను సహించబోమని మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేర్కొన్నారు.
ప్రజల చేతుల్లో శిక్ష తప్పదు
మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్
ఏటూరునాగారం, జనవరి 2: పోలీసులతో కుమ్మక్కై ప్రజల సంపదను దోచుకుంటున్న ఇసుక మాఫియా ఆగడాలను సహించబోమని మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేర్కొన్నారు. తీరు మార్చుకోకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆయన పేరిట ఆదివారం ఒక ప్రకటన వెలువడింది. గోదావరి పొడువునా ఆదివాసీ సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపుల్లో మాఫియా చొరబడిందని విమర్శించారు. తమ లాభాల కోసం ఆదివాసీ ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించి రెండు, మూడు గ్రూపులుగా చీల్చి వారి ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది కాంట్రాక్టర్ల పేరుతో చలామణి అవుతూ గ్రామాలను అభివృద్ధి పరుస్తామనే పేరుతో ప్రజలను నమ్మబలికి మోసాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు ఇసుక క్వారీలు పొంది పెద్ద కాంట్రాక్టర్లకు అమ్ముకొని గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కోట్ల రూపాయలు దండుకుంటున్నారని పేర్కొన్నారు.
పైగా అభివృద్ధి పనులను జరగకుండా అడ్డుకుంటూ ప్రజలపైనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. స్థానికేతరుడు ఒకరు ఇసుక మాఫియాను ప్రోత్సహించి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రజలకు, భూ పట్టాదారులకు డబ్బులు చెల్లించకుండా, ట్రాక్టర్ కిరాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడని పేర్కొన్నారు. ప్రస్తుతం నడుపుతున్న ఇసుక ర్యాంపు వద్ద కూడా డబ్బులు ఇవ్వకుండా పోలీసులతో కుమ్మక్కై ప్రశ్నించే ప్రజలను బెదిరింపులకు గురి చేశాడన్నాడని విమర్శించారు. అలాగే ఏటూరునాగారం మండలంలోని ముల్లెకట్ట, రాంపూర్ గ్రామాల ఇసుక ర్యాంపుల వద్ద కూడా కోదాడకు చెందిన వ్యక్తి ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. గ్రామంలోని కొంత మంది యువకులకు, ప్రజలకు మద్యం ఎరచూపి విలాసాలకు అలవాటు చేసి గ్రూపులుగా విడదీసి గ్రామంలో చిచ్చు పెడుతున్నాడని విమర్శించారు. ఇసుక సొసైటీల పేరుతో గ్రామాల్లోకి వచ్చే మాఫియాలను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.