పీకేకు రూ.600 కోట్ల కాంట్రాక్టు
ABN , First Publish Date - 2022-06-16T09:40:00+05:30 IST
పీకే రూ.600 కోట్ల కాంట్రాక్టుతో రాష్ట్రంలో టీఆర్ఎస్ తరఫున పని చేస్తున్నాడని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు.
- ప్రజల నాడి తెలిసిన కేసీఆర్కు పీకే అవసరమా?
- వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయం: ఈటల
మెదక్ అర్బన్, జూన్ 15: పీకే రూ.600 కోట్ల కాంట్రాక్టుతో రాష్ట్రంలో టీఆర్ఎస్ తరఫున పని చేస్తున్నాడని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. ప్రజల నాడి తెలిసిన సీఎం కేసీఆర్కు ఇప్పుడు పీకే అవసరం ఎందుకువచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. మాయమాటలతో ప్రజలను బోల్తా కొట్టించడంలో కేసీఆర్ నిష్ణాతుడయ్యారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల ప్రజా సంక్షేమ పాలనపై బుధవారం మెదక్లో నిర్వహించిన సదస్సులో ఈటల మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలైందన్నారు. జీతాలిచ్చేందుకు డబ్బులు లేని సర్కారు రూ.250 కోట్లతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఒక్కో జిల్లాలో ఒక్కో తేదీన ఉద్యోగులకు జీతాలిచ్చే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టి మద్యంతో రూ.40 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం సంపాదించిందని, తాగుడుకు తెలంగాణ బానిసయిందన్నారు. మరోవైపు నష్టపరిహారం ఇవ్వాలని కోరిన గౌరవెల్లి రైతులపై లారీచార్జీ చేయించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని, బీజేపీదే అధికారమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించబోతుందన్నారు.