రాజీవ్‌ స్వగృహ స్థలాల వేలానికి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-02-19T07:36:33+05:30 IST

ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు తహతహలాడుతున్న రాష్ట్ర

రాజీవ్‌ స్వగృహ స్థలాల వేలానికి సర్వం సిద్ధం

  • ఓపెన్‌ ప్లాట్లకు మార్చి  14-17 వరకు బహిరంగ వేలం 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు తహతహలాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న రాజీవ్‌ స్వగృహలోని ఖాళీ స్థలాలకు మార్చి 14 నుంచి 17 వరకు వేలం వేయనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో 240 ఓపెన్‌ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గృహకల్పకు చెందిన 202 ప్లాట్లను 14, 15, 16న బహిరంగ వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.


నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని రాజీవ్‌ స్వగృహ టౌన్‌షి్‌పలో ఖాళీ ప్లాట్లకు 14, 15, 16, 17న వేలంపాట నిర్వహించనున్నారు. అలాగే కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణానికి సమీపంలో ఉన్న బోరిగాం రాజీవ్‌ స్వగృహకు కేటాయించిన స్థలాన్ని, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద రాజీవ్‌ రహదారికి ఆనుకుని ఉన్న రాజీవ్‌ స్వగృహ స్థలాలను 14న వేలం వేయనున్నారు.


ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మూడు ఓపెన్‌ కమర్షియల్‌ ప్లాట్లకు 14న జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఆన్‌లైన్‌ ద్వారా వేలం నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూర్‌ శివారులో 50.29 ఎకరాలలో గల 230 రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్లకు 14 నుంచి 17 వరకు ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నారు.


Updated Date - 2022-02-19T07:36:33+05:30 IST