కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలి
ABN , First Publish Date - 2022-05-19T08:16:07+05:30 IST
దేశంలో కంటి సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కంటి ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం
- ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు
- హైదరాబాద్, చెన్నైలలో ఎల్వీ ప్రసాద్
- అనంత్ బజాజ్ రెటీనా ఇనిస్టిట్యూట్ల ప్రారంభం
హైదరాబాద్ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): దేశంలో కంటి సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కంటి ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. చికిత్సలను సులభతరం చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్ - అనంత్ బజాజ్ రెటీనా ఇనిస్టిట్యూట్ను బుధవారం వెంకయ్య నాయుడు వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి బజాజ్ కుటుంబానికి చెందిన పెద్దలు, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ప్రశాంత్ గర్గ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. కంటి సమస్యలను గుర్తించి.. బాధితులకు సరైన సూచనలిచ్చే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఈ సందర్భంగా వెంకయ్య చెప్పారు. కాగా, ఇదే సమయంలో చెన్నైలో ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్ - అనంత్ బజాజ్ రెటీనా ఇనిస్టిట్యూట్నూ వెంకయ్య వర్చువల్గా ప్రారంభించారు.