పోడు సర్వే, గ్రామసభల బహిష్కరణ

ABN , First Publish Date - 2022-11-25T02:49:21+05:30 IST

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(ఎ్‌ఫఆర్వో) శ్రీనివాసరావు హత్యకు నిరసనగా ఖమ్మం జిల్లా అటవీ శాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.

పోడు సర్వే, గ్రామసభల బహిష్కరణ

ఖమ్మంలో అటవీ శాఖ ఉద్యోగుల అల్టిమేటం

డిమాండ్లు నెరవేరే దాకా విధులకు దూరమని ప్రకటన

ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు మృతికి నిరసనగా ధర్నా, ర్యాలీ

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమ విభాగం, నవంబరు 24: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(ఎ్‌ఫఆర్వో) శ్రీనివాసరావు హత్యకు నిరసనగా ఖమ్మం జిల్లా అటవీ శాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా పోడు భూముల సర్వే, ఎఫ్‌ఆర్‌సీ కమిటీ గ్రామ సభలను బహిష్కరించిన ఉద్యోగులు.. ఇతర విధులకు కూడా దూరంగా ఉన్నారు. అటవీ అధికారుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో గురువారం ధర్నా చేశారు. పూర్తిస్థాయిలో రక్షణ కల్పించిన తర్వాతే విధులకు వెళ్తామని, అప్పటిదాకా కార్యాలయాలకు వచ్చి వెళ్తామని పేర్కొన్నారు. కాగా, ధర్నా చేస్తున్న ఉద్యోగులతో స్వయంగా మాట్లాడిన డీఎ్‌ఫవో సిద్ధార్థ విక్రమ్‌ సింగ్‌ వారిచ్చిన వినతి పత్రం తీసుకున్నారు. ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావును హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు ఆయుధాలు, వాహనాలు, ఫారెస్టు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

ఎఫ్‌ఆర్వో హత్య పథకం ప్రకారం జరిగిందని ఆరోపించారు. శ్రీనివా్‌సరావు భార్యకు అతడి క్యాడర్‌కు సమానంగా గెజిటెడ్‌ ఉద్యోగం ఇవ్వాలని, ఆయన కుటుంబానికి రూ.50 కోట్లు నష్టపరిహారం ప్రకటించాలని, జిల్లా కేంద్రంలో వారికి 500గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళన రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించే వరకు విధులకు దూరంగా ఉంటామని ఫారెస్టు రేంజ్‌ అధికారుల అసోసియేషన్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ శ్రీనివాస్‌ చెప్పారు.

Updated Date - 2022-11-25T02:50:12+05:30 IST