రూ.3825 కోట్లు చెల్లించండి!

ABN , First Publish Date - 2022-10-04T09:27:40+05:30 IST

తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ షాక్‌ ఇచ్చింది. భారీ జరిమానా విధించింది.

రూ.3825 కోట్లు చెల్లించండి!

  • తెలంగాణకు జరిమానా విధించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌ 
  • 2 నెలల్లో ప్రత్యేక ఖాతాలో జమ చేయండి
  • వ్యర్థాల నిర్వహణలో ఆదేశాలు పాటించరా?
  • ఎన్నిసార్లు చెప్పినా సీరియస్‌గా తీసుకోవట్లే
  • చట్టాలు, ఆదేశాల ఉల్లంఘనకు ఎవరూ 
  • బాధ్యులు కాదన్నట్లు వ్యవహరిస్తోంది
  • రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఆమోదయోగ్యం కాదు 
  • ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు 
  • పరిహారం తప్పదు!.. ఎన్జీటీ హెచ్చరిక


న్యూఢిల్లీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ షాక్‌ ఇచ్చింది. భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పాటించనందుకు గాను ఏకంగా రూ.3825 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. రోజుకు 1824 మిలియన్‌ లీటర్ల మురుగునీటి శుద్ధి వ్యత్యాసానికి గాను రూ.3648 కోట్లు, ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించనందుకు రూ.177 కోట్లు కలిపి మొత్తం రూ.3825 కోట్ల పరిహారాన్ని విధిస్తున్నట్లు తెలిపింది. రెండు నెలల్లో ఈ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ పునరుద్ధరణ కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై 1996 నుంచి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. 2014లో ఎన్జీటీకి కేసును బదిలీ చేసింది. 8 ఏళ్లుగా విచారణ జరుపుతున్న ఎన్జీటీ.. పలుసార్లు తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) స్వయంగా రెండు సార్లు విచారణకు హాజరయ్యారు. అయినా తాము జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఎన్జీటీ గుర్తించింది. దీంతో ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, న్యాయ సభ్యుడు జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ త్యాగి, సభ్య నిపుణులు సెంథిల్‌ వేల్‌, అఫ్రోజ్‌ అహ్మద్‌తో కూడిన నలుగురు సభ్యుల ధర్మాసనం జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని హెచ్చరించింది. ఆదేశాల అమలు బాధ్యత సీఎ్‌సపై ఉంటుందని, తక్షణమే ప్రత్యేక సీనియర్‌ స్థాయి నోడల్‌ కార్యదర్శి నేతృత్వంలో సాంకేతిక నిపుణులతో కూడిన బృందాన్ని నియమించాలని సూచించింది. దీని పురోగతిపై ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని సీఎ్‌సకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. 


2019లో ఆదేశించినా పట్టించుకోరా?

‘‘కనీసం మూడు ప్రధాన పట్టణాలు, మూడు టౌన్లను, ప్రతి జిల్లాలో మూడు గ్రామాలను గుర్తించి ఆరు నెలల్లో పర్యావరణ నిబంధనలను పాటించాలని 2019 ఏప్రిల్‌లో ఆదేశించాం. నేరుగా సీఎస్‌ కింద పర్యావరణ విభాగాలను ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశాం. అయితే, మా ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్నట్లు లేదు. మూడేళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో వాటిని పాటించలేదు. సమీప భవిష్యత్తులో వాటిని పాటిస్తారని కూడా అనుకోవడం లేదు. అందుకు బాధ్యులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు. పురోగతి ఆడిట్‌ను కూడా నిర్వహించినట్లు లేదు. చట్టాలతో పాటు సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎవరూ బాధ్యులు కానట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రూల్‌ ఆఫ్‌ లా ఎలా సాధ్యమవుతుందో చెప్పడం కష్టతరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ఆదేశాలను పాటిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ట్రైబ్యునల్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2020 ఫిబ్రవరిలో సీఎస్‌ తమ ముందు హాజరైన తర్వాత కూడా వ్యర్థాల నిర్వహణలో పురోగతి ఏమీ లేదని.. ఘన, ద్రవ వ్యర్థాల ఉత్పత్తి, శుద్ధిలో చాలా వ్యత్యాసం ఉందని స్పష్టం చేసింది. 


యూజర్‌ చార్జీలు వసూలు చేసుకోవచ్చు

పేరుకుపోయిన వ్యర్థాల నిర్వహణ గడువు 2021 ఏప్రిల్‌లో ముగిసిన నేపథ్యంలో పర్యావరణ పరిహారాన్ని విధించాల్సిన అవసరం ఉందని ఎన్జీటీ తెలిపింది. వ్యర్థాలకు కారకుల నుంచి తగిన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమీకరించవచ్చని సూచించింది. ఇళ్లు, కార్పొరేట్‌, వాణిజ్య, వ్యాపార వర్గాల నుంచి యూజర్‌ చార్జీల వంటివి వసూలు చేయడానికి రెండు నెలల్లో యంత్రాంగాన్ని రూపొందించాలని పేర్కొంది. మునిసిపల్‌ ఘన వ్యర్థాల నిబంధనలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని సూచించింది. జవహర్‌నగర్‌ డంప్‌ యార్డులో పేరుకుపోయిన 12 మిలియన్‌ టన్నుల వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సలహాలను తీసుకోవాలని, ఈ విషయంలో రెండు నెలల్లో అభిప్రాయాన్ని తెలియజేయాలని సీపీసీబీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు సుప్రీంకోర్టు విధించిన గడువు 2020 ఏప్రిల్‌లో ముగిసిందని, అయినా రాష్ట్రంలో ఇంకా రోజుకు 1824 మిలియన్‌ లీటర్లు శుద్ధికావడం లేదని తేల్చిన ధర్మాసనం దీనికి పర్యావరణ పరిహారాన్ని వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘కాలుష్య రహిత వాతారణాన్ని అందించడం, అవసరమైన నిధులను సమకూర్చడం రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల రాజ్యాంగబద్ధమైన బాధ్యత. నిధుల లేమి కారణంగా జీవించే హక్కును రాష్ట్ర ప్రభుత్వం హరించరాదు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

 లక్షకుపైగా జనాభా కలిగిన హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, రామగుండం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సూర్యాపేట, మిర్యాలగూడ, సిద్దిపేట, జగిత్యాలల్లో వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది.

Updated Date - 2022-10-04T09:27:40+05:30 IST