‘గాంధీ’ సినిమాపై ఇతర రాష్ట్రాల ఆసక్తి: సీఎస్‌ సోమేశ్‌

ABN , First Publish Date - 2022-08-11T07:47:46+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తున్న ‘గాంధీ’ సినిమాపై ఇతర రాష్ట్రాలు ఆసక్తిని కనబరుస్తున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

‘గాంధీ’ సినిమాపై ఇతర రాష్ట్రాల ఆసక్తి: సీఎస్‌ సోమేశ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తున్న ‘గాంధీ’ సినిమాపై ఇతర రాష్ట్రాలు ఆసక్తిని కనబరుస్తున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి బుధవారం సీఎస్‌ మాదాపూర్‌ ఇనార్బిట్‌ మాల్‌లో ‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాను విద్యార్థినీ విద్యార్థులు చూసి స్వాతంత్య్ర స్ఫూర్తిని పొందాలనేది సీఎం కేసీఆర్‌ అభిమతమని అన్నారు. అందుకే దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలోని 552 స్ర్కీన్‌లపై ఈ చిత్రాన్ని ప్రదర్శింపజేస్తున్నామన్నారు. కాగా.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 36లో జీహెచ్‌ఎంసీ కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులో సీఎస్‌ మొక్కలు నాటారు. 

Updated Date - 2022-08-11T07:47:46+05:30 IST