గౌరవ వేతనం కాదు.. పేస్కేల్ కావాలి
ABN , First Publish Date - 2022-08-15T09:26:10+05:30 IST
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ స్పష్టం చేసింది.
హామీలు అమలయ్యే వరకు సమ్మె
వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ తీర్మానం
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ స్పష్టం చేసింది. ప్రధానంగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీ ప్రకారం పేేస్కల్ జీవో వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏలు 20 రోజుల పైగా సమ్మెలో ఉన్నట్టు జేఏసీ పేర్కొంది. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ సమావేశం చైర్మన్ రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని ఖరారు చేసినట్టు ప్రతినిధులు తెలిపారు.
సమ్మె శిబిరాల వద్ద ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని, 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 17న ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసనలు, 18న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లోనూ, అలాగే 19న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో, 20న రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో పే ేస్కల్ జాతరను నిర్వహించ నున్నట్టు పేర్కొన్నారు. 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సంఘాలు కార్మిక సంఘాల సమన్వయంతో మానవహారాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 25, 26 తేదీల్లో (48 గంటల) పాటు కలెక్టరేట్ల వద్ద మహా ధర్నా, వంటావార్పుతో నిరసనలు తెలుపాలని సమావేశంలో నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎస్ కే దాదేమియా, కన్వీనర్ డి సాయన్న పాల్గొన్నారు.