రాజకీయ కాంక్షతోనే కేసీఆర్ బీఆర్ఎస్: యాష్కీ
ABN , First Publish Date - 2022-10-05T09:52:01+05:30 IST
తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను అడ్డంపెట్టుకుని కేసీఆర్ రాజకీయ కాంక్షతో బీఆర్ఎస్ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను అడ్డంపెట్టుకుని కేసీఆర్ రాజకీయ కాంక్షతో బీఆర్ఎస్ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కుమారుడు, కుమార్తె, అల్లునికి రాజ్య విస్తరణ కోసం జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారన్నారు. బీఆర్ఎస్ మొదలైతే టీఆర్ఎ్సకు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్) ఇస్తారని అన్నారు. ప్రత్యేక విమానాలు కొంటున్నారంటే ఆయన దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్ తెలంగాణ జాతి ద్రోహి అని ఆయన విమర్శించారు.