గొంతు కోసి ఇద్దరు పిల్లల హత్య!
ABN , First Publish Date - 2022-08-18T08:33:18+05:30 IST
భార్యతో గొడవపడి ఉన్మాదిగా మారాడో భర్త. అభంశుభం తెలియని కన్నబిడ్డలిద్దరినీ గొం తుకోసి నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. ఆపై తాను గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

భార్యతో గొడవపడి భర్త ఘాతుకం
ఆపై తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం
నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం
కోడేరు, ఆగస్టు 17: భార్యతో గొడవపడి ఉన్మాదిగా మారాడో భర్త. అభంశుభం తెలియని కన్నబిడ్డలిద్దరినీ గొం తుకోసి నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. ఆపై తాను గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. నిందితుడి భార్య వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన మాల ఓంకార్ (35) గతంలో ఇద్దరు భార్యలను వదిలిపెట్టాడు. మహేశ్వరి అనే యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి చందన (7), విశ్వనాథం (3) పిల్లలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానని మహేశ్వరి, వద్దని.. ఇంకా పిల్లలు కావాలి అంటూ ఓంకార్ కొన్నాళ్లుగా గొడవపడుతున్నారు. బుధవారం దంపతులు, పిల్లలను వెంటబెట్టుకొని బైక్పై నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి బయలుదేరారు. దారిలో ఇద్దరి మధ్య మళ్లీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విషయంలో గొడవ జరిగింది. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి శివారులో భార్యను ఓంకార్ బైక్పై నుంచి కిందకు తోసేశాడు. అనంతరం ఇద్దరు పిల్లలతో కలిసి నాగులపల్లి వెళ్లే రోడ్డు పక్కన గుంత వైపు వెళ్లాడు. ఇద్దరు చిన్నారులను ఒకేచోట పడుకోబెట్టి గొంతుకోసి చంపేశాడు. తర్వాత తాను గొంతుకోసుకొని పడిపోయాడు. భర్త తనతో గొడవపడి, పిల్లలతో వెళ్లిపోయిన ఘటనపై మహేశ్వరి గంట్రావుపల్లి నుంచి నేరుగా పెద్దకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓంకార్ దగ్గరకు పోలీసులొచ్చారు. అతడు అపస్మారక స్థితిలో ఉండగా.. పక్కన ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించాయి. నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. మహేశ్వరి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు.