తెలంగాణ శత్రువు మోదీయే!
ABN , First Publish Date - 2022-08-17T08:41:23+05:30 IST
తెలంగాణకు ప్రధాన శత్రువు నరేంద్ర మోదీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

కేంద్రంలో ఈ దుర్మార్గుడిని తరిమికొట్టండి
రాష్ట్రాలను గౌరవించే సర్కారును తెచ్చుకుందాం
పేదలను కొట్టి షావుకార్ల జేబులు నింపుతున్నాడు
పాలమూరు-రంగారెడ్డి జాప్యానికి కారణం కేంద్రమే
ఇక్కడి సన్నాసులకు ఢిల్లీలో నిలదీసే దమ్ముందా?
తెలంగాణను తినేందుకు సిద్ధంగా గుంటనక్కలు
అప్రమత్తంగా లేకుంటే ఉచిత కరెంటు ఎత్తేస్తారు: కేసీఆర్
వికారాబాద్ కలెక్టరేట్ షురూ.. మెడికల్ కాలేజీకి శంకుస్థాపన
ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ఆశతో విన్నా. వచ్చే రెండేళ్లలోనైనా ఏమైనా చేస్తాడనుకున్నా. గంటసేపు ఊదరగొట్టాడు. నెత్తికో రుమాలు కట్టి వేషం, కథ, డైలాగులు తప్ప.. ఒక్క మంచి మాట అయినా ఉందా దేశానికి?
బీజేపీ జెండాలకు మోసపోతే గోస పడ్తాం. ప్రాణాలర్పించి సాధించుకున్న తెలంగాణను పీక్కొని తినేందుకు గుంట నక్కలు సిద్ధంగా ఉన్నాయి. మళ్లీ పాత తెలంగాణ పరిస్థితికి దిగజారకుండా, వాళ్ల రాజకీయ స్వార్థాలకు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
- సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ప్రధాన శత్రువు నరేంద్ర మోదీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దుర్మార్గుడైన మోదీని దేశం నుంచి తరిమికొట్టి అద్భుత భారతదేశాన్ని సృష్టించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కల్లబొల్లి కథలు తప్ప ఆయన చెప్పిన ఏ ఒక్క వాగ్దానం నెరవేరలేదన్నారు. కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి 15 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మంగళవారం వికారాబాద్లో కొత్త కలెక్టరేట్ను ప్రారంభించి, ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ ప్రధాని ఎర్రకోట ప్రసంగంపై ఎంతో ఆశ పెట్టుకున్నానని, వేషాలు, డైలాగులు తప్ప అందులో ఒక పథకం లేదని ప్రస్తావించారు. దేశ పరిస్థితి దిగజారుతోందని, నిరుద్యోగం పెరుగుతోందని, రూపాయి విలువ పడిపోతోందని చెప్పారు. గతంలో ఏనాడూ లేని పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వాన్ని సాగనంపే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే సంస్కరణల పేరు పెట్టి బోర్ల కాడ, ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెట్టి చివరకు ఉచిత కరెంటు ఎత్తేస్తారని హెచ్చరించారు. రైతులకు శఠగోపం పెట్టి, సామాన్యుల కడుపులు కొట్టి పెద్దపెద్ద సావుకార్ల కడుపు నింపుతారని అన్నారు. ఉచిత కరెంటు కొనసాగాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వేరే జెండాలు చూసి ఆగమైపోతే తెలంగాణ కథ మళ్లీ మొదటికి వస్తుందని హెచ్చరించారు. పెద్ద వాళ్లకు రూ. 20 లక్షల కోట్లను దోచిపెట్టి, పేదవాడికి గ్యాస్ సిలిండర్ ధర అడ్డగోలుగా పెంచేశారన్నారు. టన్ను రూ. 4 వేలకు వచ్చే సింగరేణి బొగ్గును కాదని, ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి టన్ను రూ.30 వేలకు కొనాలని విద్యుత్ సంస్థలను ఒత్తిడి చేస్తున్నారని ప్రస్తావించారు. నిరర్ధక ఆస్తుల పేరుతో కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే బాజాప్తాగా డంకా బజాయించి చెబుతోందన్నారు.

