రాహుల్గాంధీపై మోదీ, అమిత్షా కుట్ర
ABN , First Publish Date - 2022-06-21T09:27:44+05:30 IST
‘‘ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మోదీ, అమిత్షా కుట్ర పన్నారు.
ఆయన పాదయాత్ర చేపడితే ప్రజల్లో చైతన్యం వస్తుందని బీజేపీ నాయకత్వానికి భయం’
అందుకే ఈడీ విచారణ పేరిట అడ్డంకులు
గాంధీ కుటుంబంలోని వ్యక్తికి డబ్బుకు కొదవా?
తెలంగాణలో ఎవరికి ఫోన్ చేసినా పంపుతారు
పత్రిక పెట్టి సంపాదించాల్సిన అవసరమేంటి?
దేశంలో బ్లాక్మెయిల్ రాజకీయం నడుస్తోంది
టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ‘‘ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మోదీ, అమిత్షా కుట్ర పన్నారు. ఆయన పాదయాత్ర చేపడితే ప్రజల్లో చైతన్యం వస్తుందని బీజేపీ నాయకత్వానికి భయం పట్టుకుంది. అందుకే ప్రజల దగ్గరకు రాహుల్ వెళ్లకుండా ఈడీ సాయంతో అడ్డుకుంటున్నారు. విచారణ పేరుతో గంటలకొద్దీ కార్యాలయంలో కూర్చోపెట్టి అవమానిస్తున్నారు’’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఫిషర్మెన్ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు సాయికుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాతతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలో రాజకీయ విలువలు పడిపోయాయని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఎంతో మంది ప్రధానులను చూశామని, కానీ మోదీ నేతృత్వంలో విచిత్ర పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. ‘‘రాహుల్ గాంధీకి డబ్బులకు కొదవా? దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన గాంధీ కుటుంబంలో పుట్టిన వ్యక్తికి పేపర్ పెట్టి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం ఉందా? ఆయనకు డబ్బుల అవసరమే ఉంటే తెలంగాణ నేతలకు ఫోన్ చేసినా పంపుతాం. రాజస్థాన్కు ఆయన ఫోన్ చేస్తే డబ్బులు రావా?’’ అని ప్రశ్నించారు. నాయకులను బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నప్పుడు ఐటీ, ఈడీ, సీబీఐలను బీజేపీ వాడుకుంటోందని ధ్వజమెత్తారు. రాహుల్గాంధీకి మంగళవారం కూడా ఈడీ నుంచి పిలుపు వస్తే.. ఆయన విచారణ ముగిసే వరకూ గాంధీభవన్లో తమ నిరసన దీక్ష కొనసాగుతుందని చెప్పారు. కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులు, రాహుల్పై ఈడీ విచారణ, పెట్రోల్-గ్యాస్ ధరల పెంపు, అగ్నిపథ్ తదితర అంశాలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఎ్కడిక్కడ నిలదీయాలంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.