రీజనల్‌ రింగ్‌ రోడ్డు వెంబడి ఎంఎంటీఎస్‌!

ABN , First Publish Date - 2022-03-05T06:31:52+05:30 IST

హైదరాబాద్‌ చుట్టూ ప్రతిపాదించిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు

రీజనల్‌ రింగ్‌ రోడ్డు వెంబడి ఎంఎంటీఎస్‌!

  • భూమి కేటాయిస్తే పరిశీలిస్తాం
  • రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ హామీ 
  •  బీజేపీ నేతల వినతికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  సానుకూలం 
  •  ప్రతిపాదనలు పంపాలని కిషన్‌రెడ్డికి సూచన


హైదరాబాద్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ చుట్టూ ప్రతిపాదించిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) వెంబడి ఎంఎంటీఎస్‌ రైల్వే లైను నిర్మించాలంటూ భాజపా నేతలు చేసిన వినతికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారు. ఓఆర్‌ఆర్‌కు సుమారు 40 కి.మీ.ల దూరంలో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం సేకరించే భూమిలో కొంత రైల్వేశాఖకు ఇస్తే, ఆ రింగ్‌రోడ్డు చుట్టూ ఎంఎంటీఎస్‌ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీలు అరవింద్‌, సోయం బాపురావు తదితర ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఇతర నాయకులు మాట్లాడుతూ రీజినల్‌ రింగ్‌రోడ్డు చుట్టూ ఎంఎంటీఎస్‌ కూడా చేపడితే బాగుంటుందని సూచించారు. రింగ్‌రోడ్డు వివరాలను అశ్వినీవైష్ణవ్‌ అడగగా.. 300 కి.మీ మేర పొడవు, 100 మీటర్ల వెడల్పు ఉంటుందని కిషన్‌రెడ్డి చెప్పారు. భూసేకరణ వ్యయం రూ.20వేల కోట్లు కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరిస్తున్నాయని తెలిపారు. 10 జిల్లాలను కలుపుతూ ఈ రోడ్డు ఉంటుందన్నారు. రైల్వే మంత్రి మాట్లాడుతూ.. తమ శాఖకు 30 మీటర్ల వెడల్పులో భూమి కేటాయిస్తే ఎంఎంటీఎస్‌ చేపట్టవచ్చని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడుతానని కిషన్‌ రెడ్డి చెప్పగా, రైల్వే మంత్రి స్పందిస్తూ ‘‘మీరు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయండి. సానుకూల నిర్ణయాన్ని ప్రకటిద్దాం’’ అని హామీ ఇచ్చారు. 


ఎంఎంటీఎ్‌సకు రాష్ట్ర వాటా ఇవ్వరా?

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ. 631 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా, ఇవ్వకపోవడం దురదృష్టకరమని  రైల్వే మంత్రి వైష్ణవ్‌ అన్నా రు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం వాటా నిధులను ఇప్పటికే విడుదల చేసినట్టు చెప్పారు.  కాజీపేటలో ప్రతిపాదించిన పీఓహెచ్‌(పీరియాడిక్‌ ఓవర్‌హాల్‌) వర్క్‌షాప్‌ టెండరు ప్రక్రియ రెండు నెలల్లో పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. 


Updated Date - 2022-03-05T06:31:52+05:30 IST