త్వరలోనే కేసీఆర్పై యుద్ధం
ABN , First Publish Date - 2022-07-30T09:29:49+05:30 IST
సబ్బండ వర్గాల పోరాటంతో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని.. సొంత ఆస్తిగా మార్చుకున్న కేసీఆర్పై అతి త్వరలో యుద్ధ ప్రకటన చేయతున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ నియంత
వెనకడుగు నా రక్తంలోనే లేదు..
కౌరవ సేనను ఎదిరించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
నల్లగొండ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): సబ్బండ వర్గాల పోరాటంతో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని.. సొంత ఆస్తిగా మార్చుకున్న కేసీఆర్పై అతి త్వరలో యుద్ధ ప్రకటన చేయతున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు మరో కురుక్షేత్ర యుద్ధానికి శంఖం పూరిస్తానని తెలిపారు. కౌరవ సేనను ఎదురించి, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ముఖ్యమంత్రి.. ఉద్దేశపూర్వకంగానే మునుగోడు నియోజకవర్గపై కక్ష కట్టారని ఆరోపించారు. మూడున్నరేళ్లుగా తనతో పాటు నియోజకవర్గ ప్రజలను అనేక రకాలుగా అవమానపరిచి, అభివృద్ధి పనులను నిలిపివేశారని విమర్శించారు.
ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల్లో 90శాతం పనులు 2014 కంటే ముందే పూర్తయినా, మునుగోడు ప్రజలు తనను గెలిపించారన్న కారణంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. మల్లన్నసాగర్ తరహాలో తమకూ పరిహారం ఇవ్వాలని కోరిన కిష్టరాయన్పల్లి భూ నిర్వాసితులపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తరహాలో మునుగోడును అభివృద్ధి చేస్తామంటే రాజీనామాకు సిద్ధమని తాను రెండేళ్ల కిందటే ప్రకటించానని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్.. ప్రజలకు తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ రాక్షస పాలన నుంచి విముక్తి చేసే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీ పడే ప్రసక్తి లేదని, వెనకడుగు వేయడం తన రక్తంలోనే లేదని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, యువజన, విద్యార్థి, ఉద్యోగ వర్గాలన్నీ తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయని తెలిపారు.