బీజేపీకి అలెగ్జాండర్ గతే
ABN , First Publish Date - 2022-06-25T08:57:43+05:30 IST
తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్న బీజేపీ.. చివరికి ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్లాగే పతనమవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే..
ఆ పార్టీ పతనం కావడం ఖాయం..
దొడ్డిదారిన రాష్ట్రాల్లో పెత్తనం చేస్తోంది
రాహుల్గాంధీ పాదయాత్ర చేయకుండా సోనియా, ప్రియాంక జనాన్ని కలవకుండా కుట్రలు
బీజేపీ చెప్పినట్లు వింటున్న జగన్..ఇటు సగం..
అటు సగంగా ఉన్న కేసీఆర్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్న బీజేపీ.. చివరికి ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్లాగే పతనమవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బీజేపీకి ఒక పద్ధతి, ప్రజాస్వామ్యం లేకుండా పోయాయన్నారు. సామంత రాజ్యాలను అధీనం చేసుకున్నట్లుగా రాష్ట్రాల్లో దొడ్డిదారిన పెత్తనం చెలాయిస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ను కూడా ఆ పార్టీ డమ్మీని చేసిందన్నారు. శుక్రవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం ఎన్నడూ చేయలేదని తెలిపారు. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం స్టాలిన్, మమతా బెనర్జీ వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రులను ఇబ్బందులు పెడుతోందన్నారు. ఆదాయపన్ను శాఖ రోడ్డుపై ఉండే పాన్షా్పలా తయారైందని మండిపడ్డారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పాదయాత్ర చేయకుండా, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రజల వద్దకు వెళ్లకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ సిద్ధాంతాలకే వ్యతిరేకమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి, రెండు రాష్ట్రాల్లో చిన్న చిన్న తప్పులు చేసినా.. తర్వాత సరిదిద్దుకుందని ఓ ప్రశ్నకు సమాధానంగా జగ్గారెడ్డి చెప్పారు. కానీ, ప్రజలు గోవా, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే.. ఆ ప్రభుత్వాలను కూల్చి తమ ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసుకుందన్నారు. అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన ఆ పార్టీ.. ప్రస్తుతం మహారాష్ట్రలోనూ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఆయన ప్రవర్తన అలెగ్జాండర్కు ఏమాత్రం తీసిపోదని అన్నారు. ‘‘ఏపీ సీఎం వైఎస్ జగన్.. బీజేపీ ఎలా చెబితే అలా వింటున్నడు. కేసీఆర్ అటు సగం.. ఇటు సగం ఉన్నడు. కాంగ్రె్సను తొక్కేస్తూ.. ప్రాంతీయ పార్టీలను బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.