ప్రభుత్వానికి కట్టాల్సిన లీజులు, రెవెన్యూ షేర్ ఎగవేతదారులపై కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-01-21T01:58:45+05:30 IST
ప్రభుత్వానికి కట్టవలసిన లీజులు, రెవెన్యూ షేర్ (ఏడిణపి) ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: ప్రభుత్వానికి కట్టవలసిన లీజులు, రెవెన్యూ షేర్ (ఏడిణపి) ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. లీజు అగ్రిమెంట్ నియమ నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లీజ్ డబ్బులు కట్టడానికి సహేతుకమైన కారణాలు లేని లీజ్ ఎగవేతదారుల సంస్థలకు వెంటనే చట్ట ప్రకారం చర్యలతో పాటు వివిధ ప్రభుత్వ సర్వీసుల శాఖలైనా విద్యుత్ పంపిణీ సంస్థలు, మంచినీటి సరఫరా చేసే సంస్థలకు వెంటనే విద్యుత్ సరఫరా, నీటి సరఫరా నిలుపుదల పై అధికారులు లేఖలు రాయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో తెలంగాణ పర్యాటక శాఖ లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో భాగంగా ఏ సంస్థల నుండి ఎంత డబ్బు ప్రభుత్వానికి బాకీ ఉందనే విషయంపై మంత్రికి టూరిజం అధికారులు వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అత్యంత విలువైన మరియు వ్యూహాత్మక ప్రభుత్వ భూములను పర్యాటక సౌకర్యాలను కల్పించి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి గత ప్రభుత్వాలు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు, భూములను వివిధ సంస్థలకు కేటాయించారు. అందులో భాగంగా హైదారాబాద్ నగరం లో ఐ- మాక్స్ థియేటర్ (నేక్లెస్ రోడ్), ఎక్స్ పోటెల్ హోటల్ (లోయర్ ట్యాంక్ బండ), ట్రైడెంట్ హోటల్ (మాదాపూర్), దసపల్లా హోటల్ ( జూబిలీ హిల్స్) , జలవిహార్ (నేక్లెస్ రోడ్), షామీర్ పెట్ లోని గోల్ఫ్ కోర్స్ లను ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి చేయడం జరిగింది.అయితే ఆయా సంస్థల నిర్వాహకులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు, ఆదాయంలో వాటా సరిగ్గా చెల్లించడం లేదని అధికారులు వివరించారు.
ఈ భూములను, గత ప్రభుత్వాలు లీజుకు ఇచ్చే సమయంలో ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనల ప్రకారం వార్షిక లీజు, రెవెన్యూ షేర్ ను నిర్ధారించింది. నిర్ధారించిన భూములు పొందిన కొన్ని సంస్థలు, వ్యక్తులు ప్రాజెక్టులను అభివృద్ధి చేసి వాటిని విజయవంతంగా నడిపిస్తున్నారు, కాని కొన్ని సంస్థలు చిన్న చిన్న కారణాల తో న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రాజెక్టులను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేసిన వారు ప్రభుత్వానికి నిర్దేశించిన వార్షిక లీజు , రెవెన్యూ షేర్ (ఏడీపీ) కట్టకుండా వివిధ కారణాల చేత న్యాయస్థానాలను ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకొని ప్రభుత్వ భూములలో కొనసాగుతూ, ప్రాజెక్టులని నిర్వహిస్తున్నారు.ఈ సంస్తల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయలను ఆదాయం గండి పడుతున్నది.ఈ అంశంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
బకాయి పడిన సంస్థల వివరాలు :
ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ 27.45 కోట్లు, జలవిహార్ 6.51 కోట్లు, స్నో వరల్డ్ 15.01 కోట్లు, ఎక్స్ పో టెల్ హోటల్ 15.13 కోట్లు, దసపల్ల హోటల్ 5.67 కోట్లు, ప్రజయ్ ఇండియా సిండికేట్ ( గోల్ఫ్ కోర్స్, శామీర్పెట్) 5.58 కోట్లు, ట్రైడెంట్ హోటల్ 75.05 కోట్లు రూపాయలు బకాయిలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ సంస్థల బకాయిలు వెంటనే వసూలు చేపట్టాలని, అందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ టూరిజం అధికారులను ఆదేశించారు.