దళితుల ఓట్ల కోసమే సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు: మందకృష్ణ మాదిగ

ABN , First Publish Date - 2022-09-17T10:53:50+05:30 IST

దళితుల ఓట్లను కొల్లగొట్టడానికే సచివాలయానికి సీఎం కేసీఆర్‌..

దళితుల ఓట్ల కోసమే సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు: మందకృష్ణ మాదిగ

కాళోజీ జంక్షన్‌, సెప్టెంబరు 16: దళితుల ఓట్లను కొల్లగొట్టడానికే సచివాలయానికి సీఎం కేసీఆర్‌.. అంబేద్కర్‌ పేరు పెడుతున్నారని, ఆయనపై గౌరవంతోకాదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి వత్తాసు పలికే దళిత సంఘాలు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను కీర్తిస్తూ క్షీరాభిషేకాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎంకు దళితులపై ప్రేమ ఉందని భావించి అల్ప సంతోషులు కొందరు కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారని, అయితే ఆయన వైఖరి వల్లనే దళితులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తించాలన్నారు. శుక్రవారం హనుమకొండలో విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాట్లాడారు. దేశానికి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం పనికిరాదని కొత్త రాజ్యాంగానికి ఆయన పిలుపునిచ్చిన విషయాన్ని దళితులు మరిచిపోవద్దన్నారు. భారత రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రజాస్వామ్యానికి కేసీఆర్‌ వ్యతిరేకమన్నారు. గతేడాది ఐదు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసిన సీఎం మరో ఐదు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయకుండా వాటిని ప్రభుత్వ యూనివర్సిటీలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్‌, మహాజన సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో పది రోజులపాటు గ్రామగ్రామాన ఉద్యమాలు చేస్తామన్నారు.

Updated Date - 2022-09-17T10:53:50+05:30 IST