28న Khairatabad గణపతికి తుది రూపు
ABN , First Publish Date - 2022-08-26T14:28:26+05:30 IST
ఖైరతాబాద్లో గణేష్ విగ్రహాన్ని ఏటా ఓ వినూత్న ఆకారంలో తయారు చేస్తుంటారు. ప్రముఖ దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ అప్పటి పరిస్థితులను బట్టి
హైదరాబాద్/ఖైరతాబాద్: ఖైరతాబాద్లో గణేష్ విగ్రహాన్ని ఏటా ఓ వినూత్న ఆకారంలో తయారు చేస్తుంటారు. ప్రముఖ దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ అప్పటి పరిస్థితులను బట్టి ఆకారం సూచిస్తారు. ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, శిల్పి రాజేంద్రన్, కన్వీనర్ సందీ్పరాజ్ కలిసి గణపతి నమూనాను డిజైనర్తో రూపొందిస్తారు. రెండేళ్ల నుంచి ప్రజలు అనారోగ్యాలకు గురై, ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడం, శుభకృత్ నామ సంవత్సరంలో శుభాలు కలగాలనే ఉద్దేశంతో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా పూజించాలని విఠలశర్మ ఉత్సవ కమిటీకి సూచించారు. గణపతి పంచ ముఖాలు పంచ భూతాలుగా రక్షణనిస్తాయని, లక్ష్మీగణపతిని పూజించడం వల్ల సుఖాలు, ధన ప్రాప్తి కలుగుతాయని పేర్కొన్నారు. వినాయకుడితోపాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే శత్రు నాశనం కలుగుతుందని, మరొక వైపున త్రిశక్తిగా పిలువబడే మహాగాయత్రీ దేవికి పూజలు చేస్తే ప్రజలందరికీ శుభాలు కలుగుతాయని శిల్పి రాజేంద్రన్ అన్నారు. గణపతి విగ్రహానికి రంగులద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈనెల 28వ తేదీ ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో భారీ గణపతి విగ్రహానికి కళ్లు తీర్చిదిద్ది తుది రూపు ఇవ్వనున్నట్లు శిల్పి రాజేంద్రన్ చెప్పారు.