కేసీఆర్ దళిత ద్వేషి: మందకృష్ణ
ABN , First Publish Date - 2022-02-20T00:34:58+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్వేషి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.
మిర్యాలగూడ: ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్వేషి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ అంశంపై శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ మనసులో దళితులపై పెరిగిన ద్వేషమే రాజ్యాంగాన్ని మార్చాలనే విధంగా రూపం దాల్చిందన్నారు. దళిత, బహుజనులకు అంబేడ్కర్ రాజ్యాంగం కల్పించిన హక్కులను మొత్తంగా రద్దు చేసి దొరలకు పెత్తనం కట్టబెట్టేందుకు కల్వకుంట్ల రాజ్యాంగం తెస్తారేమోనని విమర్శించారు. ఎన్ని ఉద్యమాలు, బలిదానాలు చేసినా అంబేడ్కర్ రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ చెప్పారని మందకృష్ణ గుర్తు చేశారు.