జన్వాడ ఫాంహౌజ్ నాది కాదు: కేటీఆర్
ABN , First Publish Date - 2022-02-19T07:44:05+05:30 IST
జన్వాడ ఫాంహౌజ్ తనది కాదని మంత్రి కేటీఆర్ హైకోర్టుకు
- రేవంత్రెడ్డి రాజకీయ దురుద్దేశంతో ఎన్జీటీకి వెళ్లారని హైకోర్టుకు నివేదించిన మంత్రి
- వివాదంపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): జన్వాడ ఫాంహౌజ్ తనది కాదని మంత్రి కేటీఆర్ హైకోర్టుకు నివేదించారు. రాజకీయ దురుద్దేశం, తనను ఇబ్బందిపెట్టాలనే కుట్రతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జన్వాడ ఫాంహౌజ్ తనదే అని పేర్కొంటూ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్లో పిటిషన్ వేశారని కోర్టుకు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో జీవో 111కు విరుద్ధంగా కేటీఆర్ ఫాంహౌజ్ కట్టారని పేర్కొంటూ రేవంత్రెడ్డి 2020లో ఎన్జీటీలో కేసు దాఖలుచేశారు.
దానిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ... ఫాంహౌజ్ తనిఖీ కోసం నిపుణుల కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీన్ని కేటీఆర్ హైకోర్టులో సవాల్ చేయగా.. ఎన్జీటీ తీర్పుపై స్టే విధిస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం ధర్మాసనం ఈ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టింది. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ... రేవంత్రెడ్డి కుట్రపూరితంగా తనను ఈ వివాదంలోకి లాగారని పేర్కొన్నారు.
ఫాంహౌజ్కు తాను యజమాని కాదని తెలిసి కూడా రేవంత్రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారని కోర్టుకు తెలిపారు. ఫాంహౌజ్ నిర్మాణం 2014లో జరిగిందని.. ఆరేళ్ల కింద జరిగిన నిర్మాణాలపై విచారణ చేపట్టే పరిధి ఎన్జీటీకి లేదని పేర్కొన్నారు. ఎన్జీటీ తదుపరి విచారణ చేపట్టకుండా కేసును కొట్టేయాలని కోరారు. రేవంత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ జలాశయాల్లో ఆక్రమణలు జరగకుండా అడ్డుకోవడమే తన ఉద్దేశమని.. రాజకీయ కుట్ర అనే ఆరోపణ నిజంకాదని పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాలపై విచారణ చేపట్టే అధికారం హైకోర్టుకు లేదని, కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఆ అధికారం ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ పిటిషన్ను కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు.
జన్వాడ ఫాంహౌజ్ యజమానిగా పేర్కొంటున్న ప్రదీ్పరెడ్డి తరఫున న్యాయవాది రఘురాం వాదనలు వినిపిస్తూ... ఫాంహౌజ్ అసలు యజమాని తానేనని పేర్కొన్నారు. అన్ని వర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.