నెలాఖరులోగా మహిళలకు వడ్డీలేని రుణాలు
ABN , First Publish Date - 2022-03-05T07:07:51+05:30 IST
ఈ నెలాఖరులోగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని

- రూ.400 కోట్లతో మదర్, చైల్డ్ ఆస్పత్రుల నిర్మాణం
- ఆసిఫాబాద్కు రెండు డయాలసిస్ సెంటర్లు : హరీశ్
మంచిర్యాలఐఆసిఫాబాద్/ఆదిలాబాద్ టౌన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులోగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని మంత్రి హరీశ్రావు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఇప్పటి వరకు 10 లక్షల 30 వేల మందికి 9 వేల కోట్లు అందజేసినట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ పేరుతో ప్రసవం అయ్యే వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నా రు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, మందమర్రి, క్యాతన్పల్లి, మంచిర్యాల పట్టణాల్లో ఆయన పర్యటించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని అంకుసాపూర్లో ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రలోని సామాజిక ఆస్పత్రిలో పిల్లల వార్డునూ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బాలింతలు, శిశువుల సంరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 400 కోట్లతో మదర్, చైల్డ్ కేర్ ఆస్పత్రు(ఎంసీహెచ్) లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు అధికంగా ఉన్నందున.. వారికి వైద్య సేవలందించేందుకు ఆసిఫాబాద్, కాగజ్నగర్లో రెండుచోట్ల డయాలసిస్ సెం టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసిఫాబాద్లో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్పైనా సీఎం కేసీఆర్ సీరియ్సగా పరిశీలిస్తున్నారని, త్వరలోనే శుభవార్త వింటారని పేర్కొన్నారు. అనంతరం కాగజ్నగర్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించి అక్కడే భోజనం చేశారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీసీఐను తెరిపించడంలో కేంద్రం విఫలం
ఆదిలాబాద్ జిల్లాకు తలమానికమైన సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పరిశ్రమను తెరిపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దీన్ని తిరిగి పున:ప్రారంభిస్తే నూతన పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను రాష్ట్రం తరపున తాము ఇస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షను మంత్రి శుక్రవారం సందర్శించి మద్దతు తెలిపారు. ఈ అంశంపై బీజేపీ నేతలు, ఎంపీ సోయం బాపురావు ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి ప్రశ్నించారు.