మహనీయుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం
ABN , First Publish Date - 2022-08-16T05:35:08+05:30 IST
మహనీయుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం

స్వాతంత్య్ర సంగ్రామంలో ఇక్కడి పాత్ర ఎంతో కీలకం
అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందుతోంది..
ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్ జీఆర్.రెడ్డి
కోటలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు
ప్రగతి ప్రసంగం వినిపించిన ముఖ్యఅతిథి జీఆర్.రెడ్డి
వరంగల్ కలెక్టరేట్, ఆగస్టు 15: ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్య్ర ఫలాలని, స్వాతంత్రోద్యమంలో తెలంగాణ ప్రజలు, సమరయోధుల సేవలు ఎంతో విలువైనద రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు రిటైర్డ్ ఐఈఎస్ అధికారి డాక్టర్ జీఆర్.రెడ్డి అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సోమవారం చారిత్రక ఖిలావరంగల్లోని ఖుష్మహాల్ ప్రాంతంలో ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా జీఆర్.రెడ్డి రాగా, కలెక్టర్ బి.గోపి, డీసీపీ వెంకటలక్ష్మి ఘన స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జీఆర్రెడ్డి మాట్లాడారు. చారిత్రక వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అహింస మార్గంలో నిర్వహించిన ఉద్యమంలో ఎందరో మహానుభావులు ముఖ్య పాత్ర పోషించారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సరోజినీనాయుడు, తెలంగాణకు చెందిన కొమురం భీం, చాకలి ఐలమ్మ, కాళోజీ నారాయణరావు ఎందరో మహానుభావులు పోరాట ఫలమే ఇప్పుడుమనం అనుభవిస్తున్నామన్నారు. ఆహార కొరత ఉన్న దేశం నుంచి మిగులు దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు సాఫ్ట్వేర్ సేవలను ఎగుమతి చేసే ప్రధాన దేశంగా ఇండియా అవతరించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎన్ని అవరోధాలువచ్చినా పోరాటం నిర్వహించి 2014 జూన్ 2న రాష్ట్రాన్ని సాధించారన్నారు.
విద్యుత్ సమస్యలను అధిగమించి..
రాష్ట్ర ప్రభుత్వం 77, 78 మెగావాట్లు ఉన్న విద్యుత్ను 17305 మెగా వాట్లకు చేరుకునేలా విద్యుత్ను ఉత్పత్తి చేసి, కరెంటు కోతలు లేకుండా చేసిందని జీఆర్.రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి ప్రారంభించారన్నారు. దళిత బంధు పథకాన్ని ఇప్పటి వరకు జిల్లాలో 303 కుటుంబాలు లబ్ధిపొందాయని, వచ్చే ఏడాది ఒక నియోజక వర్గానికి 1500 యూనిట్లు ఇస్తామన్నారు. మన ఊరు- మన బడి, మన బస్తీ - మన బడి పథకంలో మొదటి విడతగా 223 పాఠశాలలను ఎంపిక చేసి రూ.2కోట్లను నిధులను విడుదల చేసి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం ద్వారా జిల్లాలో 1,01,956 పింఛన్లు మంజూ చేయగా, నేటి నుంచి 29,245 మందికి కొత్త పింఛన్లను మంజూరు చేసిందన్నారు.
రైతు క్షేమం కోసం..
రైతుబంధు కింద ఈ వానాకాలం పంటకు గాను 1,45,128 మంది రైతులకు రూ. 133.81 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందన్నారు. బీమా ద్వారా 395మందికి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల జమ చేయడం జరిగిందని జీఆర్.రెడ్డి అన్నారు. జిల్లాలో 9,231 ఎకరాలలో ఫామాయిల్ తోటలు పెంచాలని నిర్దేశించి 3086 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి జిల్లాలో, గ్రామాల్లో 576క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి 127 ప్రాంగణాలకు మంజూరు చేయగా 23 పూర్తయ్యాయి.
కరోనాను తట్టుకుని..
కరోనా మహమ్మారిని జిల్లా తట్టుకుని నిలిచిందన్నారు. జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ 105శాతం, రెండో డోస్ 104.08 శాతం పూర్తి చేసినట్లు జీఆర్.రెడ్డి తెలిపారు. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి 98 శాతం, ప్రికాషనరీ డోస్ 23 శాతం , 302 గ్రామాల ఆవాసాలలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. కల్యాణ లక్ష్మీ పథకం జిల్లాలో 25,050 మంది కుటుంబాలకు, షాదీముబారక్ ద్వారా 2936 మందికి ఆర్థిక సహాయం అందజేశారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బి.గోపి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, డీసీపీ వెంకటలక్ష్మి, అదనపు కలెక్టర్లు బి.హరిసింగ్, కె.శ్రీవత్స, పాల్గొన్నారు.
కోటలో సంబరాలు
ఖిలావరంగల్: సాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలు ఖిలావరంగల్ మధ్యకోటలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, రిటైర్డ్ ఐఈఎస్ అధికారి డాక్టర్ జీఆర్.రెడ్డి హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందన సవ ుర్పణ స్వీకరించారు. ఈ సందర్భంగా శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లాలో వివిధ శాఖల్లోని ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన అలరించాయి. కాగా, ఖుష్మహల్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల అభివృద్ధిని తెలిపే శకటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా గ్రామీణాభి వృద్ధి శాఖ శకటానికి ప్రథమ, డీఆర్డీఏకు ద్వితీయ, విద్యాశాఖ శకటం తృతీయ బహుమతిని సాధించాయి.
వర్షంతో ఉత్సవాలకు ఆటంకం
కోటలో వేడుకలకు వర్షం ఇబ్బంది పెట్టింది. ఉత్సవాల కోసం సిద్ధం చేసిన మైదానం బురదమయంగా మారింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక కార్యక్ర మాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ మేరకు నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల నాట్య ప్రదర్శనలు, దేశ భక్తి గీతాల ఆలాపనలు, జాతీయ జెండాలతో నృత్యాలు, వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు అలరించాయి. మధ్యకోటలోని మైదానాన్ని శాశ్వత ప్రాతిపా దికన ఉత్సవాలకు అభివృద్ధి చేయాలని పర్యాటకులు, ప్రజలు కోరుతున్నారు.
