హనుమాన్‌ జన్మస్థలం మహారాష్ట్ర కాదు.. కర్ణాటకే!

ABN , First Publish Date - 2022-05-30T09:09:15+05:30 IST

ఆంజనేయ స్వామి జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్‌లోని అంజనేరి కాదని.. కర్ణాటకలోని కిష్కింధ మాత్రమేనని కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ అంటున్నారు.

హనుమాన్‌ జన్మస్థలం మహారాష్ట్ర కాదు.. కర్ణాటకే!

  • రేపు నాసిక్‌లో ధర్మసంసద్‌ చర్చ
  • సాధువుల నిర్ణయాన్ని ఆమోదిస్తాం
  • స్వామి అనికేత్‌ శాస్త్రి దేశ్‌పాండే వెల్లడి


నాసిక్‌, మే 29: ఆంజనేయ స్వామి జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్‌లోని అంజనేరి కాదని.. కర్ణాటకలోని కిష్కింధ మాత్రమేనని కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ అంటున్నారు. దీనిపై నాసిక్‌లో గురువారం ధర్మసంసద్‌ సమావేశానికి ఆయన పిలుపిచ్చారు. అక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే సాధువులు, సంత్‌ల అభిప్రాయాలు తీసుకుంటామని.. వారు తీసుకునే నిర్ణయాన్ని అందరూ ఆమోదిస్తారని శ్రీమండలాచార్య పీఠాధీశ్వర్‌ మహంత్‌ స్వామి అనికేత్‌ శాస్త్రి దేశ్‌పాండే వెల్లడించారు. అంజనేరిలో ఆంజనేయుడు పుట్టాడని రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. కర్ణాటకకే చెందిన మహంత్‌ గోవింద్‌ దాస్‌ కూడా ఇదే ఉద్ఘాటించారు. జన్మస్థలం ఒక్కటే ఉంటుందని.. అంజనేరిలో ఆంజనేయుడు పుట్టినట్లు వాల్మీకి రాయలేదని.. కిష్కింధలోనే జన్మించాడని  రాశాడని పేర్కొన్నారు. 


ధర్మసంసద్‌లో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే ఓ రథంలో త్రయంబకేశ్వర్‌  చేరుకున్నారు. కాగా.. తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) ప్రకటించగా.. కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అంజనాద్రిపై భారీ అభివృద్ధి పనులపై ఆంధ్ర హైకోర్టు స్టే ఇచ్చినా.. అంజనాద్రిని ఆంజనేయుడి జన్మస్థలమని నిరూపించేందుకు టీటీడీ తగు ఆధారాలు సేకరిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే పనిలో ఉంది. కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా గంగావతి తాలూకాలోని ‘అంజనాద్రి పర్వత’ను ప్రపంచ స్థాయి అంతర్జాతీయ యాత్రా కేంద్రంగా, టూరిజం కారిడార్‌గా రూపుదిద్దాలని నిర్ణయించింది. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న రామసేతను కూడా ఈ కారిడార్‌లో చేర్చాలని యోచిస్తోంది. ఓ పక్క వారాణసీలో జ్ఞానవాపి మసీదు, మథురలో శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో ఇప్పుడు హనుమాన్‌ జన్మస్థలంపై వివాదం తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2022-05-30T09:09:15+05:30 IST