గ్రూప్-1 సరిగా రాయలేదని యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-10-18T08:56:18+05:30 IST
గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
నిప్పంటించుకుని బలవన్మరణం
మేడ్చల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రింగు రోడ్డు పక్కన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ మండలంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్కు చెందిన జి.సాకేత్ (28) ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు. ప్రశ్నాపత్రం కష్టంగా వచ్చిందని, తాను సరిగా రాయలేదని, ఉద్యోగం రాదని ఇంట్లో వారితో చెప్పి ఆవేదన చెందాడు. ఆదివారం రాత్రి భోజనం చేసి తన గదిలోకి వెళ్లిన సాకేత్ ఇంట్లో వారు నిద్రించిన తర్వాత ఫ్యాన్కు ఉరేసుకోవాలనుకున్నాడు. అది సాధ్యం కాక తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సూసైడ్ నోట్ రాసిపెట్టి బైక్పై బయటకు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం మేడ్చల్ మండలం గౌడవెల్లి పరిధి రింగు రోడ్డు పక్కన కాలిపోయిన మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి సాకేత్గా గుర్తించారు.