భళా.. చపాట మిర్చి!
ABN , First Publish Date - 2022-09-30T05:44:03+05:30 IST
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు - జీఐటీ) పొందే వస్తువుల జాబితాలో చేరేందుకు పోటీపడుతున్న వరంగల్ చపాట మిరపకాయ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తిం పు దక్కించుకున్న పోచంపల్లి ఇక్కత్ చీరలు, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదాబాద్ హలీమ్తో పాటు మరికొన్ని వస్తువుల జాబితాలో దేశంలోనే అత్యంత తీపి మిర్చిరకంలో ఒకటైన వరంగల్ చపాట మిరప చేరనున్నది. జీఐ ట్యాగ్ లభిస్తే ఆ ఉత్పత్తుల వరుసలో ఇది 18వది అవుతుంది.
పలు ప్రత్యేకతల సమాహారం
ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా సాగు
భౌగోళిక గుర్తింపు జాబితాలో చేరేందుకు పోటీ
దరఖాస్తు చేసిన జేవీఆర్ పరిశోధనా కేంద్రం
జీఐ ట్యాగ్ లభిస్తే చపాటకు మరింత డిమాండ్
హనుమకొండ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు - జీఐటీ) పొందే వస్తువుల జాబితాలో చేరేందుకు పోటీపడుతున్న వరంగల్ చపాట మిరపకాయ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తిం పు దక్కించుకున్న పోచంపల్లి ఇక్కత్ చీరలు, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదాబాద్ హలీమ్తో పాటు మరికొన్ని వస్తువుల జాబితాలో దేశంలోనే అత్యంత తీపి మిర్చిరకంలో ఒకటైన వరంగల్ చపాట మిరప చేరనున్నది. జీఐ ట్యాగ్ లభిస్తే ఆ ఉత్పత్తుల వరుసలో ఇది 18వది అవుతుంది.
ఏడాదిగా ఆధ్యయనం
భౌగోళిక గుర్తింపు సాధించేందుకు దాని పుట్టుక, అవసరమైన సాగు విధానాలు, ఈ మిరపకున్న విశిష్టమైన లక్షణాలు, ప్రయోజనాలు తదితర అంశాలపై మహబూబాబాద్లోని జెన్నారెడ్డి వెంకట్రెడ్డి ఉద్యానవన పరిశోధనా కేంద్రం (జేవీఆర్) శాస్త్రవేత్తలు ఏడాది కాలంగా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన డాక్యుమెంట్ను రూపొందించారు. ఈ మిర్చిలోని పోషక విలువలను రాజేంద్రనగర్లోని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో, రసాయనిక గుణాలను గుంటూరులోని స్పైస్ బోర్డు పరీక్ష చేసింది. వరంగల్ జిల్లా తిమ్మంపేట రైతుల మిర్చి ఉత్పత్తి సంస్థ, జేవీఆర్ పరిశోధనా కేంద్రం చైన్నయ్లోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చపాట మర్చికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ ఽఇటీవల దరఖాస్తు చేశాయి. భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. మార్కెట్ అవకాశాలు విస్తారంగా ఉంటాయి. ఎగుమతులు కూడా అధికంగా ఉంటాయి.
ఉష్ణోగ్రత తక్కువే..
ఆయా ఉత్పత్తుల ఘాటును కొలిచే సాధనం స్కోవిల్లే స్కేల్ ద్వారా చపాట మిర్చిని పరీక్షించి చూశారు. మిగతా మిరపకాయల రకాలతో పోల్చిచూస్తే ఘాటు చాలా తక్కువ అని నిర్ధారణ అయింది. చపాట మిర్చి ఉష్ణ విలువ 4000-8000 మధ్య ఎస్హెచ్యూ ఉంటుంది. సాధారణ మిర్చి రకాలకు భిన్నంగా ప్రత్యేక ఆకారం, రంగు, రుచి కలిగిన చపాట మిర్చికి స్థానికంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ మిర్చి ధర క్వింటాల్ రూ.25వేలకుపైనే పలుకుతోంది. ఈ మిర్చిని ఆహారశుద్ధి పరిశ్రమలు, రెస్టారెంట్లు, బేవరేజేస్, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ మిరప రకానికి అంతర్జాతీయంగా మరీ ముఖ్యంగా తూర్పు ఆసియాలో విపరీతమైన డిమాండ్ ఉంది.
లాభసాటి పంట
ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఎంతో కాలంగా పండిస్తున్న ఈ వెరైటీ మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విత్తనోత్పత్తిని రైతులు స్వయంగా చేసుకోవడంతో పాటు పంట సాగులో కూలీల ఖర్చు కూడా ఎంతో తక్కువ. అందుకే చపాట మిర్చిసాగులో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా బాగా కలిసోస్తుంది. ఎకరానికి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతోకాలంగా ఈ మిరప రకాన్ని పండిస్తున్నారు. ఈ చపాట మిర్చిపై జేవీఆర్ పరిశోధనా కేంద్రంలో చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. డబుల్ పట్టి, సింగిల్ పట్టి, లంబుకాయ, టమాట మర్చి తదితర పేర్లతో దీనిని పిలుస్తుంటారు. కోత కోసేప్పుడు కూలీల ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. కాయలు లావుగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
విదేశాలకు ఎగుమతి
వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం ఈ మిర్చిని ఎక్కువగా పండిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, ఏనుమాముల, గుజరాత్, ముంబై, ఆహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, ఇంగ్లండ్, అమెరికాకు తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగులను నిషేధించిన దేశాల్లో ఈ చపాట మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ ఆహార రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాట మిర్చిని ఉపయోగిస్తారు. ఇందులో నుంచి ఓల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్గా వాడుతారు. మన దేశంలో ఎక్కువగా వీటిని పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు. వివిధ రకాల ఐస్క్రీం రంగుల తయారీలోనూ చపాట మిర్చిని వినియోగిస్తున్నారు.
మరింత లబ్ధి
చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు వస్తే రైతులకు మరింత ప్రయోజనం సమకూరుతుంది. భౌగోళిక గుర్తింపును సాధించినట్లయితే ఈ మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ పెరుగుతుంది. ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేందుకు, గ్రామీణ యువతకు కూడా ఉపాధి కల్పించినట్లవుతంది.
అలాగే ప్రీమియం ధర పెరిగి వరంగల్ చపాట పండించే రైతులకు ముఖ్యంగా లబ్ధి చేకూరుతుంది. సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో ఈ మిర్చి ఎక్కువగా పండుతుంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీరు ఉష్కలంగా అందుబాటులో ఉన్నందు వల్ల చపాట సాగుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి.
రైతులకు మేలు
- బొమ్మినేని రవీందర్ రెడ్డి, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు
వరంగల్ చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ లభిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. జీఐ గుర్తింపు వల్ల చపాట మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. మార్కెటింగ్ అవకాశాలు మెరుగవుతాయి. ఎగుమతులు మరింత పెరుగుతాయి. దీనివల్ల ఈ మిర్చి పండించే రైతులకు ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుంది.