అర్హులకు పారదర్శకంగా ‘దళితబంధు’
ABN , First Publish Date - 2022-02-23T06:09:30+05:30 IST
అర్హులకు పారదర్శకంగా ‘దళితబంధు’
- వరంగల్ కలెక్టర్ గోపి
రాయపర్తి, ఫిబ్రవరి 22 : తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన వారికి పారదర్శకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని కలెక్టర్ గోపి స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన లబ్ధిదారుల అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కిష్టాపురం గ్రామం దళిత బంధు పథకానికి ఎంపికైందని, గ్రామంలో ఉన్న పేదదళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఎంపీడీవో కిషన్నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
భవన నిర్మాణాలకు అనుమతి తీసుకోవాలి..
వరంగల్ కలెక్టరేట్ : టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, 75 గజాల వరకు రూపాయి, 75 గజాలు దాటితే ఆన్లైన్లో చూపించే మొత్తం చెల్లించాలని కలెక్టర్ గోపి స్పష్టం చేశారు. టీఎస్ బీపాస్ ఎన్ఫోర్స్మెంట్ సభ్యులతో జిల్లాస్థాయి సమావేశాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్ ఫోర్స్మెంట్ కమిటీచైర్మన్, కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి, మునిసిపల్ స్థాయి, ఎన్ఫోర్స్మెంట్ కమిటీలు సమన్వయంతో పనిచేసి టీఎస్ బీపాస్ నిబంధనలు అమల య్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఆర్డీవో మహేందర్జీ, నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, నర్సంపేట ఏసీపీ ఫణిందర్, నర్సంపేట మునిసిపల్ కమిషనర్ విద్యాదర్, వర్ధన్నపేట మునిసిపల్ కమిషనర్ రవీందర్, ఆర్అండ్బీ శాఖ ఈఈ జితేందర్, అగ్నిమాపక శాఖ అధికారి భగవాన్, నర్సంపేట పట్టణ ప్రణాళిక అధికారి వీరస్వామి, డీటీసీపీవో రత్నకుమారి పాల్గొన్నారు.