ఐసీఎస్ఈ పరీక్షలలో సత్తాచాటిన తెలంగాణ విద్యార్థులు
ABN , First Publish Date - 2022-07-19T00:47:38+05:30 IST
కరోనా మహమ్మారి విజృంభణ, ఆన్లైన్ తరగతులు.. వీటికి తోడు పరీక్షల విధానంలో అకస్మాత్తుగా మార్పులు.. అయినప్పటికీ
హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ, ఆన్లైన్ తరగతులు.. వీటికి తోడు పరీక్షల విధానంలో అకస్మాత్తుగా మార్పులు.. అయినప్పటికీ తెలంగాణ విద్యార్థులు ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలలో సత్తా చాటారు. నగరంలోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్కు చెందిన విద్యార్థులు ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్లో స్థానం సంపాదించారు. ఈ స్కూల్కు చెందిన రియా సుసన్ టోనీ 99.4శాతం మార్కులు సాధించగా, అదే స్కూల్కు చెందిన కటారు రోహిత రెడ్డి 98.2శాతం మార్కులు సాధించి సెకండ్ టాపర్గా నిలిచింది.
తన విజయానికి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లోని టీచర్లతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉందని రోహిత పేర్కొంది. టీచర్లు ఎప్పుడూ తమకు అందుబాటులో ఉండేవారని తెలిపింది. మహమ్మారి కారణంగా డెహ్రాడూన్లోని వెల్హామ్స్ గాళ్స్ స్కూల్ వదిలి తాను ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో చేరానని చెప్పింది. కరోనా మహమ్మారి ఓ సవాల్ విసిరితే, ఆన్లైన్ విధానం స్వీకరించడం మరో సవాల్గా నిలిచింది. దీనికి తోడు పరీక్షల విధానంలో మార్పులు కూడా విద్యార్థులకు పరీక్షగా మారాయి. అయితే నమూనా పరీక్షలను ఎక్కువగా రాయడంతో పాటుగా స్కూల్ నిర్వహించిన ప్రీ బోర్డ్ పరీక్షలకు హాజరుకావడం, సందేహాలను నివృత్తి చేయడానికి ఆన్లైన్లో టీచర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం తమకు సహాయపడ్డాయని వెల్లడించింది. ఐఐటీ పరీక్షలలో తన సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్న రోహిత కంప్యూటర్ ఇంజినీర్ కావాలని, పరిశోధనా రంగంలో స్థిర పడాలని కోరుకుంటుంది.