11 జిల్లాల్లో ఫ్లో‘రైడ్’!
ABN , First Publish Date - 2022-01-31T08:31:47+05:30 IST
ఎముకలను వంకర్లు తిప్పే ఫ్లోరైడ్ రక్కసి తెలంగాణను వదలడం లేదు. రాష్ట్రంలోని 11 జిల్లాల భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. న ల్లగొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, హన్మకొండ జిల్లాల్లోని...
- భూగర్భ జలాల్లో మోతాదుకు మించి
- వరంగల్ గౌతమినగర్లో లీటరు నీటిలో అత్యధికంగా 23.5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్
- కాలువలున్న భూముల్లో భారీగా ‘నైట్రోజన్’
- సాగర్, ఆర్డీఎస్ కింద 45 శాతానికి మించి
- ‘తెలంగాణ రాష్ట్ర హైడ్రాలజీ-20’ నివేదిక
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఎముకలను వంకర్లు తిప్పే ఫ్లోరైడ్ రక్కసి తెలంగాణను వదలడం లేదు. రాష్ట్రంలోని 11 జిల్లాల భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. న ల్లగొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, హన్మకొండ జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ మోతాదు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర హైడ్రాలజీ-2020’ నివేదికలో దీనికి సంబంధించిన పలు దిగ్ర్భాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. భూగర్భ జలాల్లో లీటరుకు 1.5 మిల్లీగ్రాము దాకా ఫ్లోరైడ్ ఉంటే దాన్ని సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. అయితే 11 జిల్లాల భూగర్భ జలాల్లో అంతకంటే ఎక్కువ మోతాదులోనే ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. 2019 సంవత్సరంలో వర్షాలు కురవడానికి ముందు అక్కడి జలాల్లో 15 శాతం ఫ్లోరైడ్ ఉండగా, వర్షాలు కురిసిన తర్వాత అది తగ్గి 11 శాతానికి చేరినట్లు వెల్లడైంది. 2012 జాతీయ విధాన మార్గదర్శకాల ప్రకారం భూగర్భ జలాల నాణ్యతను ఏటా వర్షాలు కురవడానికి ముందు (మే నెలలో).. వర్షాకాలం ముగిసిన తర్వాత (నవంబరులో) చెరోసారి నిర్ధారిస్తారు.
ఇందుకోసం నీటి శాంపిళ్లను సేకరించి ప్రత్యేక నాణ్యతా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఈక్రమంలో 2019 మే నెలలో 3,551 శాంపిళ్లను.. అదే ఏడాది నవంబరులో 3,767 నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షించారు. వీటిలో 1,118 శాంపిళ్లలో.. ఒక్కో లీటరు నీటిలో 1.5 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ ఫ్లోరైడ్ శాతం ఉన్నట్లు తేల్చారు. ఇంతకుముందు వరకు నల్లగొండ జిల్లాకే పరిమితమైన ఫ్లోరైడ్ భూతం.. ఇప్పుడు మరిన్ని జిల్లాలకు విస్తరించిందనే అంశం ఆందోళన రేకెత్తించేలా ఉంది. ఆర్డీఎస్, జూరాల, నాగార్జునసాగర్ ఎడమ కాలువ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల కిందనున్న భూముల్లో నైట్రోజన్ స్థాయి 45 శాతం నుంచి 47 శాతం దాకా ఉన్నట్లు వెలుగుచూడటం గమనార్హం.
పలు జిల్లాల్లో..
నల్లగొండ జిల్లాలో వర్షాలకు ముందు లీటరు నీటిలో 5.63 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉండగా... వర్షాలు కురిసిన తర్వాత అది 3.63 మిల్లీగ్రాములకు తగ్గింది. ఈ జిల్లాలోని మునుగోడు, ఎం.దోమలపల్లి, పి.దోమలపల్లి, అంగడిపేట,వెలమగూడ, వావికోల్, నర్సింగ్భట్ల, శివన్నగూడెం, ఖుదాభక్ష్పల్లి, అంతంపేట, నామాపూర్, వెంకన్నగూడెం, అడవి దేవులపల్లి, కాల్వలపల్లి తదితర ప్రాంతాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ముందు సగటున లీటరు నీటిలో 6 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉండగా.. వర్షాల తర్వాత అది 3.27కు తగ్గింది.
వరంగల్ అర్బన్(హన్మకొండ) జిల్లాలో వర్షాలకు ముందు లీటరు నీటిలో 8.5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉండగా.. వర్షాల తర్వాత స్వల్పంగా తగ్గి 8.02 మిల్లీగ్రాములకు చేరింది. ఈ జిల్లాలో ధర్మసాగర్, కోమటిపల్లి, శనిగరం, సింగారం, దేవన్నపేట తదితర ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. వరంగల్ నగరంలోని గౌతమినగర్లో లీటరు నీటిలో ఏకంగా 23.5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉన్నట్లు తేల్చారు. వరంగల్ జిల్లాలోని ఖిలా వరంగల్, తిమ్మాపూర్లలో ఫ్లోరైడ్ అధికంగా ఉంది.
జనగామ జిల్లాలో వర్షాలకు ముందు 4.8 మిల్లీగ్రాములు ఉంటే... వర్షాల తర్వాత 3.02 మిల్లీగ్రాములుగా తేల్చారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ముందు 3.47 మిల్లీగ్రాములున్న ఫ్లోరైడ్... ఆ తర్వాత 3 మిల్లీ గ్రాములకు పడిపోయింది.
ఎందుకు.. ఏమిటి?
భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. నదులు, చెరువులు, కాల్వలు వంటి ఉపరితల జల వనరుల్లో ఫ్లోరైడ్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇంతకీ భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ మోతాదు ఇప్పుడు ఎందుకు పెరుగుతోంది ? అంటే.. ‘భూగర్భ జల మట్టాలు తగ్గడం వల్లే’ అని ఒకే ఒక్క వాక్యంలో సమాధానం చెప్పొచ్చు. భూగర్భ జలమట్టాలు తగ్గిపోయి లోతుకు వెళ్తున్న కొద్దీ.. ఫ్లోరైడ్, స్ట్రానియం, సిలికాన్ వంటివి కలిసిన కలుషిత జలాలు లభ్యమవుతున్నాయి. ఆ నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏడు మండలాలతో కూడిన ఉద్దానం ప్రాంతంలో వందలాది మందిని కిడ్నీ వ్యాధులు ముసురుకోవడానికి ఈవిధమైన ఫ్లోరైడ్ నీళ్లే ప్రధాన కారణమని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మినహా తెలంగాణలోని చాలా జిల్లాల భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ మోతాదు తక్కువగానే ఉండేది. ఇప్పుడది క్రమంగా పెరుగుతోంది అనేందుకు తాజాగా విడుదలైన ‘తెలంగాణ రాష్ట్ర హైడ్రాలజీ-2020’ నివేదికలోనే గణాంకాలే నిదర్శనం. ‘మిషన్ భగీరథ’ నీటి వల్ల నల్లగొండ జిల్లాలోని పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య కొంతమేర సమసిపోయిన సంగతి తెలిసిందే.
