ఇంజనీరింగ్ ఫీజులపై మళ్లీ కసరత్తు షురూ
ABN , First Publish Date - 2022-09-08T08:53:05+05:30 IST
ఇంజనీరింగ్ ఫీజుల ఖరారుపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎ్ఫఆర్సీ) మరోసారి కసరత్తు ప్రారంభించింది.
టీఏఎ్ఫఆర్సీ అధికారుల భేటీ.. పలు అంశాలపై చర్చ
హైదరాబాద్, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ ఫీజుల ఖరారుపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎ్ఫఆర్సీ) మరోసారి కసరత్తు ప్రారంభించింది. కొన్ని కాలేజీలు కోర్టుకెళ్లి ఫీజులను పెంచుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో టీఏఎ్ఫఆర్సీ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ మేరకు బుధవారం సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాలేజీల ఆడిట్ నివేదికలను పునఃపరిశీలించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో కాలేజీలకు వస్తున్న ఆదాయం ఎంత? ఖర్చు ఏ స్థాయిలో ఉంది? ఉద్యోగులకు చెల్లించే వేతనాలెంత? వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా కాలేజీలకు ఏ మేర ఫీజులను పెంచాలనే విషయమై ఏఎ్ఫఆర్సీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టుల ద్వారా పెంచుకున్న ఫీజుల కంటే... కొంత తక్కువ స్థాయిలో ఫీజులను ఖరారు చేయాలన్న ఆలోచనలో కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావాలని ఏఎ్ఫఆర్సీ అధికారులు భావిస్తున్నారు.