వచ్చే నెల 26 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు !
ABN , First Publish Date - 2022-08-04T10:00:37+05:30 IST
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
- సెప్టెంబరు 5 నుంచి ఎఫ్ఏ-2 పరీక్షలు
- ఫిబ్రవరి లోపు టెన్త్ ప్రీఫైనల్.. విద్యాధికారుల సర్క్యులర్
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. కరోనా వల్ల గత మూడేళ్లగా విద్యా బోధన అస్తవ్యస్తం కావడంతో ఈ విద్యా సంవత్సరంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు విద్యాధికారులు ఓ సర్క్యులర్ జారీ చేశారు. దానిప్రకారం సెప్టెంబరు 5 నుంచి ఫార్మాటివ్ అసె్సమెంట్-2 (ఎఫ్ఏ) పరీక్షలు నిర్వహించాలని, నవంబరు 1-7 తేదీల్లోపు సమ్మెటివ్ అసె్సమెంట్ (ఎస్ఏ)-1ను పూర్తి చేయాలని సూచించారు. అలాగే డిసెంబరులో ఎఫ్ఏ-3, వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఎఫ్ఏ-4 పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక, పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఫిబ్రవరి లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేసి వారిని ప్రధాన పరీక్షలకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, డిసెంబరు 22-28 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13-17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.