డబుల్‌ ఇంజన్‌ పక్కా!

ABN , First Publish Date - 2022-07-04T08:39:09+05:30 IST

‘‘తెలంగాణలో బీజేపీపై రోజురోజుకూ అభిమానం, విశ్వాసం, మద్దతు పెరుగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతు ఇచ్చారు.

డబుల్‌ ఇంజన్‌ పక్కా!

  • తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు
  • ప్రజలు ఇప్పటికే పట్టాలు వేస్తున్నారు..
  • అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళతాం
  • పట్టణాలతోపాటు పల్లె అభివృద్ధికి కృషి..
  • హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్‌ సిటీని తెస్తాం
  • తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ రాబోతోంది..
  • దాంతో రైతులకు మేలు, యువతకు ఉపాధి
  • ఆరేళ్లలో లక్ష కోట్ల ధాన్యం కొనుగోలు చేశాం..
  • 5 సాగునీటి ప్రాజెక్టులకు 35 వేల కోట్లిచ్చాం
  • రోడ్లు, ఫ్లై ఓవర్లు, హైవేలతో తెలంగాణ వికాసం..
  • విజయ్‌ సంకల్ప సభలో మోదీ వ్యాఖ్యలు


హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో బీజేపీపై రోజురోజుకూ అభిమానం, విశ్వాసం, మద్దతు పెరుగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతు ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఇది రెట్టింపైంది. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు తప్పకుండా వస్తుంది. పట్టణాలతోపాటు తెలంగాణలోని ప్రతి పల్లె అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంగా పని చేస్తాం! అందరినీ సమ దృష్టితో చూస్తాం! ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం పని చేస్తాం! తెలంగాణ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళతాం’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉందో తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. బీజేపీపై తెలంగాణ ప్రజలకు ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 


తెలంగాణ ఘనమైన చరిత్ర నుంచి ప్రస్తుత అభివృద్ధి వరకూ దాదాపు ప్రతి అంశాన్నీ ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గణాంకాలతో సహా వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి చేశామో పథకాల వారీగా వివరించారు. కానీ, ఎక్కడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరును కానీ, అధికార టీఆర్‌ఎస్‌ పేరును కానీ ప్రస్తావించలేదు. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూనే.. ‘తెలంగాణకు మేం ఏం చేశాం’ అన్న అంశంపైనే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. కరోనా టీకాల నుంచి వరి ధాన్యం కొనుగోలు వరకూ ప్రస్తావించారు. రోడ్లు, హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ల నుంచి గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల వరకూ తాము నిధులు ఇస్తున్నామని వివరించారు. తద్వారా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తూ, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాయని, తెలంగాణ సమాజం కూడా అదే అభివృద్ధిని కోరుకుంటోందని అన్నారు. సభకు పెద్దఎత్తున వచ్చిన జనాలను చూసి ఖుషీ అయిపోయారు. కార్యకర్తలంతా ఉత్సాహంగా మోదీ.. మోదీ.. అంటూ కేరింతలు కొడుతుండడంతో ‘మీ ప్రేమాభిమానాలు, ఉత్సాహాన్ని దేశ ప్రజలంతా చూస్తున్నారు’ అని ఉబ్బితబ్బిబ్బయ్యారు. తద్వారా, తెలంగాణలోనూ బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకం తెలంగాణలోని ప్రతి పేదవారికి, దళితులకు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలకు, మధ్యతరగతి వర్గాలకు అందాయని, డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పడితే పట్టణాలతోపాటు గ్రామాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసమే బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాన్ని ఇక్కడ పెట్టాలని నిర్ణయించామన్నారు.


కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్లు

వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తే.. ప్రతి కుటుంబానికి న్యాయం చేశామని, దేశ ప్రజలతోపాటు తెలంగాణలోని కోట్లాది మందికి వేగంగా, ఉచితంగా టీకా అందించామని మోదీ గుర్తు చేశారు. దేశ ప్రజలతోపాటు తెలంగాణలోని పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని, వైద్యాన్ని ఉచితంగా అందించామని చెప్పారు. ‘‘భారత్‌లో పరిశోధన, సృజనాత్మకతకు తెలంగాణ కేంద్రంగా ఉంది. కరోనా సమయంలో హైదరాబాద్‌లోనే టీకాలను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను ఈ టీకాలు కాపాడాయి’’ అని కితాబునిచ్చారు. అదే సమయంలో, హైదరాబాద్‌లో పరిశోధన, సృజనాత్మకతకు అనువైన వాతావరణాన్ని ఈ ఎనిమిదేళ్లలో ఏర్పాటు చేశామని మోదీ చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్‌ సిటీని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేషనల్‌ యానిమల్‌ రిసెర్చ్‌ సౌకర్యం, బయో మెడికల్‌ రిసెర్చ్‌, ఆధునిక పరిశోధన కేంద్రాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. సాంకేతికత, సృజనలకే పరిమితం కాకుండా పేద, గ్రామీణ కుటుంబాలకు చెందిన యువతీ, యువకుల ప్రతిభను కూడా ప్రోత్సహిస్తున్నాం. నూతన విద్యా విధానంలో భాగంగా స్థానిక భాషల్లో చదువు చెప్పించాలని నిర్ణయించాం. తెలుగులో టెక్నాలజీ, వైద్య విద్యను అభ్యసించే అవకాశం దొరికితే అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల కలలు నిజమవుతాయి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.


పురుషుల కంటే పెరిగిన మహిళలు

21వ శతాబ్దంలో నారీమణులను శక్తిమంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, అందుకే, దేశంలో తొలిసారి పురుషుల కన్నా మహిళల జనాభా పెరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. సభకు పెద్దఎత్తున మహిళలు వచ్చారు. వారిని చూస్తూ మహిళలకు తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. ‘‘ఇక్కడికి పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు, సోదరీమణులు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మీ ప్రేమ, ఉత్సాహం అర్థం చేసుకుంటున్నా. మా ప్రభుత్వం మహిళలు, యువతులు, అమ్మాయిల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసింది. స్వచ్ఛ భారత్‌తో గౌరవప్రదమైన జీవితాన్ని అందించాం. బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసే మహిళల ప్రాతినిథ్యం పెంచాం. తద్వారా, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మహిళల పాత్ర పెరిగింది. బ్యాంకులను మహిళలతో అనుసంధానం చేశాం. జనధన్‌ యోజన కింద దేశంలో 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిస్తే.. వాటిలో కోటికిపైగా ఖాతాలు తెలంగాణలోనే ఉన్నాయి. ముద్ర రుణాల్లో మహిళల వాటా పెరిగింది’’ అని అన్నారు.


రామగుండం తెరిచాం.. మెగా పార్క్‌ ఇచ్చాం

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఏమి చేసిందన్న ప్రశ్నలకు ప్రధాని మోదీ జవాబు ఇచ్చారు. ‘‘2015లో తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు రూ.6,500 కోట్లను కేటాయించాం. ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించాం. దీనివల్ల విదేశాల నుంచి ఎరువులు దిగుమతి చేసుకునే పరిస్థితి తగ్గనుంది’’ అని వివరించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా 5ఎఫ్‌లను అమలు చేస్తున్నామని వివరించారు. ‘ఫామ్‌ టు ఫైబర్‌, ఫైబర్‌ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్‌, ఫ్యాషన్‌ టు ఫారిన్‌’ అని వాటిని వివరించారు. ఈ నినాదంతోనే టెక్స్‌టైల్‌ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దేశంలో 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘‘టెక్స్‌టైల్‌ పార్కులతో రైతులకు మేలు కలుగుతుంది. వ్యాపారాలు మెరుగుపడతాయి. వేలాదిమంది యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి’’ అని వివరించారు.


ఆరేళ్లలో రూ.లక్ష కోట్ల వరి ధాన్యం కొన్నాం

ఇటీవలి కాలంలో తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన వరి ధాన్యం కొనుగోళ్లను ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. తద్వారా, ఆరేళ్లలోనే లక్ష కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని తామే కొన్నామని వివరించారు. ‘‘తెలంగాణలో రైతుల ఆదాయం మెరుగుపరిచాం. నీటిపారుదల రంగంలో 5 ప్రాజెక్టులకు రూ.35 వేల కోట్లకుపైగా నిధులు ఇస్తున్నాం. ఆరేళ్లలో రూ.లక్ష కోట్ల విలువ చేసే వరిధాన్యం కొనుగోలు చేశాం. వరి రైతులకు రెండింతలు డబ్బులు ఇచ్చాం’’ అని తెలిపారు. తద్వారా, రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న హామీని నెరవేర్చలేదన్న విమర్శలకు ప్రధాని జవాబు ఇచ్చారు. ఈ ఏడాది ధాన్యం కనీస మద్దతు ధరను రూ.80పెంచి రూ.2000కుపైగా చేశామని గుర్తు చేశారు.

Updated Date - 2022-07-04T08:39:09+05:30 IST