దళితుడిని సీఎం చేసే దమ్ముందా?
ABN , First Publish Date - 2022-09-17T08:54:04+05:30 IST
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె ప్రమేయం బయటపడటంతో ఆయన అంబేడ్కర్ నామ స్మరణ చేస్తున్నారని..
వజ్రోత్సవాల్లో కుళ్లిన అన్నం పెడతారా?: బండి సంజయ్
సికింద్రాబాద్/మారేడుపల్లి/తిరుమలగిరి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె ప్రమేయం బయటపడటంతో ఆయన అంబేడ్కర్ నామ స్మరణ చేస్తున్నారని.. అందుకే సచివాలయానికి అంబేడ్కర్ పేరు అంటూ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. దమ్ముంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సీటులో దళితుడిని కూర్చోపెట్టాలని సవాల్ విసిరారు. కొత్త సచివాలయంలో సీఎం సీటులో దళితుడిని కూర్చోబెట్టే దమ్ముందా..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం కంటోన్మెంట్లో కొనసాగింది. పికెట్లోని కంటోన్మెంట్ డిస్పెన్సరీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. సంతోషిమాత ఆలయం, గాంధీనగర్ మీదుగా మహేంద్రాహిల్స్ చేరుకుంది. ఈ సందర్భంగా సంజయ్మాట్లాడారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వజ్రోత్సవాల్లో కుళ్లిపోయిన భోజన ప్యాకెట్లను అందించి చిన్నారులు, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడటం సిగ్గుచేటన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ పికెట్లోని కంటోన్మెంట్ డిస్పెన్సరీలో బస చేయడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రధాని మోదీ 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్. నాగభూషన్రెడ్డి 72 కిలోల లడ్డూ తయారు చేశారు. దీనిని బండి సంజయ్ ఆవిష్కరించారు.