సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో యువతపై కాల్పులను ఖండించిన Ramakrishna
ABN , First Publish Date - 2022-06-17T20:22:55+05:30 IST
నిరుద్యోగ యువతపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు కాల్పులు జరపడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.
హైదరాబాద్: నిరుద్యోగ యువతపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు కాల్పులు జరపడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ(Modi) గత ఎనిమిదేళ్లు నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. ఇప్పుడు భారత సైన్యంలో నాలుగేళ్ల కాంట్రాక్ట్ పద్ధతి తీసుకువచ్చే విధంగా మోదీ సర్కార్ అగ్నిపధ్ పథకం తీసుకురావటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
భారత సైన్యం ప్రతిష్టను మంటగలిపేలా నరేంద్రమోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కాల్పుల్లో మరణించిన నిరుద్యోగి కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.